ఏలూరు లోక్సభ అభ్యర్థి ఎంపికపై వివాదం తలెత్తింది. ఇటు టీడీపీ ఇన్చార్జ్, అటు బీజేపీ ఇన్చార్జ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడప నుంచి తీసుకొచ్చి ఏలూరులో ఎలా నిలబెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఏలూరు సీటును బీజేపీ పార్లమెంట్ ఇన్చార్జ్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన చౌదరి) ఆశిస్తున్నారు. అలాగే ఏలూరు పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జ్ గోపాల్యాదవ్ కూడా ఏడాది నుంచి విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.
పొత్తులో భాగంగా వీళ్లిద్దరినీ కాదని బాగా డబ్బుందనే ఏకైక కారణంతో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడిని తీసుకొచ్చి తమపై రుద్దడం ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు. తనకు టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన టీడీపీ ఇన్చార్జ్ గోపాల్యాదవ్ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు క్షమాపణ చెప్పడం గమనార్హం. అలాగే బీసీలకు అత్యధికంగా ఎంపీ సీట్లు ఇచ్చి, అందరి అభిమానాన్ని చూరగొన్నారని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. బహుశా పార్టీ వీడే అవకాశం వుందనే వార్తలొస్తున్నాయి. సీఎంను ప్రశంసించడంతో వైసీపీ వైపు ఆయన మొగ్గు చూప వచ్చనే చర్చకు తెరలేచింది.
ఇక గారపాటి సీతారామాంజనేయ చౌదరి విషయానికి వస్తే... ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని చాలా కాలంగా ఆయన పని చేసుకుంటూ వెళుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఆలయాల నిర్మాణం, తాగునీటి సరఫరా నిమిత్తం ట్యాంకర్ల ఏర్పాటు, అలాగే ప్రజలకు అవసరమైన చోట విరాళాలు ఇస్తూ అభిమానాన్ని చూరగొన్నారు. ఒకవేళ పొత్తు కుదిరితే కూటమి తరపున , లేదంటే ఒంటరిగా పోటీ చేయడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
గారపాటి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబునాయుడు తమ అభ్యర్థిని ప్రకటించారు. దీంతో గారపాటి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన సమాయత్తం అవుతున్నారని తెలిసింది. అదే జరిగితే టీడీపీ అభ్యర్థి ఘోరంగా ఓటమి రుచి చూడనున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు