Advertisement

Advertisement


Home > Politics - Andhra

బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న వైఎస్ జగన్!

బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న వైఎస్ జగన్!

సినిమా పొడవునా హీరో ఎంత అల్లరిగా, ఆకతాయిగా కనిపించినా పర్లేదు. యాంటీక్లయిమాక్స్ మొదలైన తర్వాత క్లయిమాక్స్ లో తన ఉదాత్తతను, మంచితనాన్ని, హీరోయిజాన్ని నిరూపించుకుని నలుగురికీ ఉపయోగపడే మంచి పనిచేస్తే చాలు. ఆ హీరోను నెత్తిన పెట్టుకుని సినిమాను సూపర్ హిట్ చేయడం మనకు అలవాటు. అతిపెద్దదైన ఒక వర్గంలో నాలుగేళ్ల సుదీర్ఘ పాలన కాలంలో కొన్ని అసంతృప్తులు, వ్యతిరేకతలకు కారణం అయినప్పటికీ.. వారందరినీ ఒక్కసారిగా ఆకట్టుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తున్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ ఏర్పాటు చేయడం గురించి కసరత్తు చేస్తున్నట్టుగా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. కొత్త పీఆర్సీని ఈ ఏడాది జులై నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వాలు.. పీఆర్సీను ఇంప్లిమెంట్ చేయాల్సిన గడువు మీరిపోయినా సరే.. సుదీర్ఘకాలం పాటు అసలు కమిషన్ ఏర్పాటు చేయడంలోనే జాగు చేస్తుంటాయి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి సర్కారు గడువు కంటె ముందుగానే పీఆర్సీ కమిటీ వేయడానికి కసరత్తు చేస్తుండడం విశేషం.

ఈ కసరత్తు ఉద్యోగుల్లో సానుకూల పవనాలు క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తునారు. గత పీఆర్సీ సిఫారసులను అమలు చేయడంలో వచ్చిన విభేదాలు కావొచ్చు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను తిరిగి అమల్లోకి తెస్తానన్న మాటను జగన్ నిలబెట్టుకోలేకపోవడం వల్ల కావొచ్చు. కారణాలు ఏమైనా, ఉద్యోగ వర్గాల జగన్ సర్కారు పట్ల ఒక వ్యతిరేకత ఏర్పడిన మాట నిజం. వారిలోను వ్యతిరేకతను దూరం చేసి, తిరిగి తన పట్ల ప్రసన్నులుగా మార్చుకునే లక్ష్యంతోనే ఇప్పుడు పీఆర్సీ కసరత్తు జరుగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. 

కమిషన్ ను ఇప్పుడే ఏర్పాటు చేసేసి.. కొన్ని నెలల తర్వాత.. సరిగ్గా ఎన్నికలకు ముందు వారి నివేదికను తీసుకుని.. కొత్త జీతాల పెంపును ప్రకటించినా చాలు. ఒక్కసారిగా ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతాయి. జగన్ పట్ల ఈ నాలుగేళ్లలో కలిగిన వ్యతిరేక అభిప్రాయాలను వారు చిటికెలో మరచిపోగలరు. ఒకసారి వ్యతిరేకత తొలగిపోయాక.. మిగిలిన సమాజానికి జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అన్నీ కూడా వారికి పాజిటివ్ దృక్కోణంలోనే కనిపిస్తాయి. 

అలా ఎన్నికల వేళకు, కీలకమైన ఉద్యోగ వర్గాల్లో పాజిటివిటీ ఏర్పడుతుందని జగన్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం తన ఇటీవలి మేనిఫెస్టోలో ఉద్యోగుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. జగన్ ఇప్పుడు ఆ వర్గంపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?