మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి టీడీపీలో ప్రత్యేక నాయకుడు. చంద్రబాబు మనసులో ఆయనకు విశిష్ట స్థానం. 2014 ఎన్నికల్లో సోమిరెడ్డి ఓడిపోయినప్పటికీ, ఎమ్మెల్సీ పదవితో పాటు తన కేబినెట్లో సోమిరెడ్డికి వ్యవసాయశాఖ మంత్రి పదవి ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయారు. అయినప్పటికీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి టీడీపీ టికెట్ ఇస్తూనే వుంది. అందుకే ఆయన టీడీపీలో విశేష నాయకుడని చెప్పడం.
టీడీపీ ఇవాళ విడుదల చేసిన మూడో జాబితాలో తిరుపతి జిల్లా సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి టికెట్ దక్కించుకున్నారు. సోమిరెడ్డి టికెట్ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయనకు టికెట్ ఇవ్వరనే ప్రచారం జరిగింది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ, అలాగే 2012లో కొవ్వూరు ఉప ఎన్నికలోనూ సోమిరెడ్డి ఓటమిపాలయ్యారు. తాజాగా ఆరోసారి టికెట్ సాధించడంలో ఆయన విజయం సాధించారు.
వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇచ్చేది లేదని లోకేశ్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో సోమిరెడ్డికి టికెట్ దక్కదనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ సర్వేపల్లి టికెట్ను ఆయనకు ఖరారు చేశారు. సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో సోమిరెడ్డి ముచ్చటగా మూడోసారి తలపడనున్నారు.
2014, 2019లో కాకాణిపై సోమిరెడ్డి సర్వేపల్లిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మూడోసారి కాకాణిపై గెలుపొందేందుకు సోమిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ సారైనా ఆయన కల నెరవేరుతుందా? అనే ప్రశ్న తలెత్తింది. టికెట్ విజేత అయిన సోమిరెడ్డి, ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలవుతుండడం చర్చనీయాంశమైంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు