అభ్యర్థులకు గతిలేని పార్టీల జాబితాలో బిజెపి ముందు నుంచీ ఉండనే ఉంది. కానీ ఏపీ రాజకీయాల విషయానికి వస్తే.. వారి గతిలేనితనం ఇంకా బయటపడలేదు. ఎందుకంటే వారు ఇంకా టికెట్లు ప్రకటించనేలేదు. ఆదివారం సాయంత్రం టికెట్లు కొన్నింటిని ప్రకటిస్తారని వార్తలు వస్తుండగా.. కొన్ని గంటల ముందే వారి గతిలేనితనం కూడా బయటపడిపోయింది.
తమది ఎంత గొప్ప, ఎంత అద్భుతమైన పార్టీనో తరచుగా డప్పు కొట్టుకుంటూ ఉండే భారతీయ జనతా పార్టీకి, గతంలో ఇదే స్థానంలో గెలిచిన చరిత్ర ఉన్నా కూడా.. సొంతంగా తమ అభ్యర్థిని నిలిపేందుకు గతిలేని పరిస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ ఒక్కసారిగా పార్టీ ఫిరాయించారు. ఇలా ఢిల్లీలో ఆయన కమలం కండువా కప్పుకోవడం- అలా తిరుపతి ఎంపీ టికెట్ పుచ్చుకోవడం వెంటవెంటనే జరిగిపోయింది.
నిజానికి పార్టీ ఇంకా అభ్యర్థుల జాబితాలను ప్రకటించనేలేదు. సాయంత్రం ప్రకటిస్తారని అంటున్నారు. కానీ.. కమలం కండువా కప్పించుకున్న వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్, ఆ వెంటనే అక్కడ ప్రెస్ తో మాట్లాడుతూ.. తిరుపతి ఎంపీగా మరోసారి ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించినందుకు భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. అంటే.. ఆయన పార్టీ జాబితాను ప్రకటించడానికి ముందే తనకు తాను టికెట్ ప్రకటించేసుకున్నారు.
నిజానికి వరప్రసాద్ చాన్నాళ్లుగా వైసీపీని వీడి.. ఇతర పార్టీల్లోకి గెంతడానికి రకరకాల ఆలోచనలు చేస్తూ వచ్చారు. బిజెపితో పొత్తు కుదరకముందునుంచీ ఆయన ఇదే ఆలోచన చేస్తున్నారు. ఫిరాయింపు ఆలోచనలతోనే ఆయన గతంలో పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. ఆయన జనసేనలో చేరబోతున్నట్టుగా అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ.. పవన్ చాణక్య తెలివితేటల వల్ల ఆయన చేరిక కొన్నాళ్లు వాయిదా పడింది. ఇప్పుడు బిజెపితో కూడా పొత్తులు కుదిరిన తర్వాత.. పవన్ సూచనతోనే ఆయన బిజెపిలోకి వెళ్లారు. ఆ పార్టీ తరఫున తిరుపతి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు.
పవన్ కల్యాణ్ తన మనుషుల్ని కూడా బిజెపిలోకి చొరబెట్టి వారికి టికెట్లు ఇప్పించుకుని, అంతా తానే అయి చెలరేగడంలో.. చంద్రబాబు బాటనే అనుసరిస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు. అంతకుమించి.. వరప్రసాద్ ను ఇలా చేర్చుకుని అలా ఎంపీ టికెట్ ఇవ్వడంలో బిజెపి గతిలేని తనం బయటపడిపోతున్నదని కూడా అంటున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు