కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేనకు టీడీపీ ఇన్చార్జ్ వర్మ చుక్కలు చూపిస్తున్నారు. పిఠాపురంలో తాను పోటీ చేస్తానని పవన్కల్యాణ్ ప్రకటించగానే, ఆ నియోజకవర్గ టీడీపీ భగ్గుమంది. టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. వర్మ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీలో వుంటానని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు పిలిపించుకుని మాట్లాడిన తర్వాతే వర్మ జనసేన అభ్యర్థికి చేయడానికి అంగీకరించారు. దీంతో పిఠాపురంలో కథ సుఖాంతమైందని అంతా భావించారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. పిఠాపురంలో తనకు తెలియకుండా ఏ ఒక్క టీడీపీ కార్యకర్త, నాయకుడు జనసేనకు ప్రచారం చేయడానికి వీల్లేదని వర్మ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. వర్మ వ్యవహార శైలి జనసేన నాయకులు, కార్యకర్తలకు కోపం తెప్పిస్తోంది.
పవన్కల్యాణ్ను గెలిపించాలని వర్మ లేదా టీడీపీ మనస్ఫూర్తిగా పని చేస్తారనే నమ్మకం రోజురోజుకూ జనసేన నేతల్లో సడలుతోంది. పవన్ గెలిస్తే శాశ్వతంగా తన రాజకీయ జీవితానికి చేజేతులా సమాధి కట్టుకున్నట్టు అవుతుందని వర్మ తన సన్నిహితుల వద్ద అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే పవన్ గెలిస్తే , పవర్ షేరింగ్ అడుగుతారని, లోకేశ్కు ప్రత్యామ్నామయంగా ఎదుగుతారనే భయం టీడీపీలో వుంది.
ఎన్నికల అవసరాల రీత్యా పవన్తో పొత్తు పెట్టుకున్నారే తప్ప, ఆయనపై చంద్రబాబు, లోకేశ్తో పాటు టీడీపీ నేతలెవరికీ మంచి అభిప్రాయం లేదు. ఒకవేళ రేపు కూటమి అధికారంలోకి వచ్చి, పవన్ కూడా గెలిస్తే, బీజేపీ చెప్పినట్టు నాటకం ఆడేందుకు ఆయన వెనుకాడరనే భయం టీడీపీ ముఖ్య నేతల్లో వుంది. అందుకే మొగ్గ దశలోనే పవన్ను తుంచేయడం మంచిదనే బలమైన అభిప్రాయం టీడీపీ నేతల్లో వుంది. ఇదే ఇప్పుడు పిఠాపురంలో పవన్ను భయపెడుతోంది.
పిఠాపురంలో పవన్కు మద్దతుపై చంద్రబాబు, వర్మ పైకి ఎన్ని మాట్లాడినా, లోపల చేసేది మరోలా వుంది. ఈ వాస్తవం పిఠాపురం జనసేన స్థానిక నాయకులకు బాగా తెలియడం వల్లే భయపడుతున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు