టీడీపీలో కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అనే నిబంధన ఉత్తుత్తిదే అని తేలిపోయింది. డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లకు ఎన్ని టికెట్లైనా ఇస్తారని రుజువైంది. టికెట్లు దక్కని వాళ్లు చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరీ ముఖ్యంగా వారసులకు టికెట్లు దక్కించుకోలేని నేతల ఆవేదన, ఆగ్రహాన్ని మాటల్లో చెప్పలేం. తాజాగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇంట్లో మొత్తం నలుగురికి పదవులు ఇవ్వడంపై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కారాలు మిరియాలు నూరుతున్నారు.
యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ పదవి, ఆయన వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్కు వైఎస్సార్ జిల్లా మైదుకూరు అసెంబ్లీ సీటు, యనమల అల్లుడు (సుధాకర్ యాదవ్ కుమారుడు) పుట్టా మహేశ్ యాదవ్కు ఏలూరు ఎంపీ సీటు, యనమల కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ టికెట్ దక్కాయి. దీంతో ఒకే కుటుంబంలో నలుగురికి పదవులు దక్కినట్టైంది.
ఇదే తమ వారసుడు చింతకాయల విజయ్కి అనకాపల్లి ఎంపీ సీటు అడిగితే, చంద్రబాబు, లోకేశ్ కాదన్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యనమల కుటుంబం కావాల్సినంత డబ్బు సంపాదించుకుని, ఇప్పుడు టికెట్లు కొంటున్నారని, తమ వద్ద అది లేకనే బాబు కళ్లలో పడలేకపోతున్నామని అయ్యన్నపాత్రుడితో పాటు పలువురు పార్టీ సీనియర్లు అంతర్గత సంభాషణల్లో తిట్టి పోస్తున్నారు.
టీడీపీ పూర్తిగా డబ్బు మయమైందని, గతంలో ఎప్పుడూ ఇలా వుండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డబ్బు వుంటే చాలు... అప్పటికప్పుడు ఆకాశం నుంచి దిగొచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక సీటు కూడా దక్కని పరిస్థితి తమదైతే, యనమల, ఇటీవల పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఇళ్లలో ఒకటికి మించి సీట్లు దక్కడం ఏంటనే నిలదీత సీనియర్ నేతల నుంచి వస్తోంది. చంద్రబాబు కూడా తమకు సంబంధించి నలుగురికి సీట్లు ఇచ్చుకున్న సంగతి తెలిసిందే.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు