‘మనం’ టీవీ.. ఖండించిన నాగార్జున

‘మా టీవీ’ని స్టార్‌ ఇండియా సంస్థకు ఇటీవలే అప్పగించేసిన దరిమిలా, సినీ నటుడు నాగార్జున ‘మనం’ పేరుతో కొత్త ఛానల్‌ని ప్రారంభించనున్నట్లు గత కొన్నాళ్ళుగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ గాసిప్స్‌పై నాగార్జున వివరణ ఇచ్చారు.…

‘మా టీవీ’ని స్టార్‌ ఇండియా సంస్థకు ఇటీవలే అప్పగించేసిన దరిమిలా, సినీ నటుడు నాగార్జున ‘మనం’ పేరుతో కొత్త ఛానల్‌ని ప్రారంభించనున్నట్లు గత కొన్నాళ్ళుగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ గాసిప్స్‌పై నాగార్జున వివరణ ఇచ్చారు. ‘మనం’ టీవీ అంటూ వస్తున్న గాసిప్స్‌లో నిజం లేదని ట్విట్టర్‌ ద్వారా స్పష్టతనిచ్చారు నాగార్జున.

చిరంజీవి, నాగార్జున మరికొందరు చాలాకాలంగా ‘మాటీవీ’ భాగస్వాములుగా వ్యవహరిస్తోన్న విషయం విదితమే. ఇటీవలే స్టార్‌ ఇండియాలో ‘మా గ్రూప్‌’ని విలీనం చేశారు. ఈ కార్యక్రమానికి ‘మాటీవీ’ భాగస్వాములు, స్టార్‌ ఇండియా ప్రతినిథులు హాజరయ్యారు. మాటీవీ, మా మ్యూజిక్‌, మా గోల్డ్‌.. ఇలా పలు ఛానల్స్‌ వున్నాయి మా గ్రూప్‌లో. అవన్నీ స్టార్‌ ఇండియా గ్రూప్‌లోకి వెళ్ళిపోయాయి.

దాంతో, నాగార్జున తనకంటూ ఓ ఛానల్‌ వుండాలనే కోణంలో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం టైటిల్‌ ‘మనం’ని తన కొత్త మీడియా గ్రూప్‌కి పెట్టాలనుకుంటున్నట్లు మీడియాలో గాసిప్స్‌ గుప్పుమన్నాయి. ఆ దిశగా నాగ్‌ ప్రయత్నాలు చేస్తున్నారంటూ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది. ఇప్పుడు నాగార్జునే స్వయంగా ఆ గాసిప్స్‌ని ఖండించారు గనుక, ‘మనం’ ఛానల్‌ అనేది కేవలం గాసిప్‌గానే మిగిలిపోయింది.