మహేష్‌ గురించి బుస్సేనా?

మహేష్‌బాబుని హీరోగా పరిచయం చేసిన వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఆ తర్వాత సైనికుడు సినిమా తెరకెక్కింది. తర్వాత మహేష్‌తో అశ్వనీదత్‌ మరే సినిమా నిర్మించలేదు. కానీ చాలా కాలంగా మహేష్‌ డేట్స్‌ కోసం ఆయన…

మహేష్‌బాబుని హీరోగా పరిచయం చేసిన వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఆ తర్వాత సైనికుడు సినిమా తెరకెక్కింది. తర్వాత మహేష్‌తో అశ్వనీదత్‌ మరే సినిమా నిర్మించలేదు. కానీ చాలా కాలంగా మహేష్‌ డేట్స్‌ కోసం ఆయన కాళ్లు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. వీరిద్దరి కలయికలో త్వరలోనే సినిమా మొదలు కానుందని చాలా సార్లు వార్తలు వచ్చాయి కానీ అవేమీ నిజం కాలేదు. 

క్రిష్‌ డైరెక్షన్‌లో ‘శివం’ దాదాపు ఖరారైనట్టే అనుకున్నారు కానీ మహేష్‌ ఆ ప్రాజెక్ట్‌ కూడా పక్కన పెట్టేసాడు. ఇప్పుడు కొత్తగా బాలీవుడ్‌ దర్శకులు రాజ్‌, డి.కెలతో మహేష్‌ సినిమా చేయబోతున్నాడనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. దీనిని అశ్వనీదత్‌ నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే మహేష్‌ ఇంతవరకు ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించలేదు. 

మహేష్‌ తనంతట తానుగా చెప్పిన క్రిష్‌ సినిమానే పక్కన పడిపోయినప్పుడు, ఇప్పుడీ సినిమా ఉంటుందని అస్సలు నమ్మలేం. ఎందుకంటే మహేష్‌ ఆల్రెడీ ‘ఆగడు’ మొదలు పెట్టాడు. తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ వెంటనే మరోసారి ‘దూకుడు’, ‘1’, ‘ఆగడు’ చిత్రాల నిర్మాతలకి మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు. ఇవన్నీ అయ్యే సరికి ఇంకా ఏమి లైన్‌లోకి వస్తాయో తెలీదు. కాబట్టి సదరు రాజ్‌, డికెల సినిమా ప్రస్తుతానికి వార్తలకే పరిమితమయ్యేట్టుంది.