రవితేజ సినిమాకు దారేది..?

రాజా ది గ్రేట్ సక్సెస్ తర్వాత వీలైనంత తొందరగా నెక్ట్స్ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నాడు రవితేజ. అనుకున్నట్టుగానే 'టచ్ చేసి చూడు' ప్రాజెక్టును ఎలాగోలా ఫినిష్ చేశారు. సరిగ్గా రిలీజ్ డేట్ ఎనౌన్స్…

రాజా ది గ్రేట్ సక్సెస్ తర్వాత వీలైనంత తొందరగా నెక్ట్స్ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నాడు రవితేజ. అనుకున్నట్టుగానే 'టచ్ చేసి చూడు' ప్రాజెక్టును ఎలాగోలా ఫినిష్ చేశారు. సరిగ్గా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేద్దామనే టైమ్ కు పోటీ వచ్చిపడింది.

డిసెంబర్ చివరి వారంలో విడుదల అనుకున్న టచ్ చేసి చూడు, సంక్రాంతికి వస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. ఈ మేరకు మేకర్స్ కూడా ఫీలర్లు వదిలారు. కానీ సంక్రాంతి నుంచి ఇది సైడైపోయింది. ఇప్పుడు మరో కొత్త తేదీ కోసం వెదుకులాట మొదలుపెట్టారు.

తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి తర్వాత జనవరి 25న టచ్ చేసి చూడు సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే దాదాపు అదే తేదీని ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది.

అయితే ఆ వారంలో కూడా పోటీ మామూలుగా ఏం లేదు. అనుష్క నటించిన భాగమతిని జనవరి 26న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా కూడా సంక్రాంతి నుంచి వాయిదాపడి జనవరి 26కు వచ్చి చేరింది. వీటితో పాటు దండుపాళ్యం-3, రాజరథం లాంటి చిన్న సినిమాలు 2-3 ఉండనే ఉన్నాయి.

మరి ఇన్ని సినిమాల మధ్యలో 'టచ్ చేసి చూడు' వస్తుందా అనేది డౌట్. పోనీ మరోసారి వాయిదా వేద్దామంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి వరుసగా సినిమాలు క్యూ కట్టాయి. రవితేజ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.