జనసేనాని పవన్కల్యాణ్పై సీపీఎం విరుచుకుపడింది. తెలంగాణలో బీజేపీతో పవన్కల్యాణ్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీలో టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. బీజేపీతో సంబంధం లేకుండా వుంటే పవన్తో వామపక్షాలు పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో వుండేవి. గత ఎన్నికల్లో వామపక్షాలతో జనసేన పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లింది. ఆ తర్వాత వామపక్షాలకు కనీసం సమాచారం ఇవ్వకుండానే బీజేపీతో అంటకాగడంపై కమ్యూనిస్టులు మండిపడ్డారు.
జనసేనాని పవన్ విషయంలో సీపీఐ ఇంకా సానుకూల ధోరణితో వుంది. ఇంకా పవన్పై విమర్శలకు దిగలేదు. కానీ సీపీఎం మాత్రం ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడడం గమనార్హం. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్రావు మీడియాతో మాట్లాడుతూ అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్కు ప్రజారాజ్యం పార్టీని అమ్మేశారని గుర్తు చేశారు. తాజాగా ఆర్ఎస్ఎస్కు జనసేన పార్టీని అమ్ముతావా? అని పవన్ను ఆయన నిలదీయడం గమనార్హం.
తెలంగాణలో డబుల్ ఇంజన్ పాలన కావాలని పవన్ కోరడంపై ఆయన మండిపడ్డారు. అంటే బుల్డోజర్ పాలన కావాలా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నిలదీశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్కల్యాణ్ ఏనాడైనా బీజేపీని ప్రశ్నించారా? అని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీకి ఇస్తున్నవి పాచిపోయిన లడ్డూలని విమర్శించిన పవన్, ఇప్పుడు బీజేపీకి ఎందుకు వంతపాడుతు న్నావని ఆయన నిలదీశారు.
బీజేపీ ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు తీసుకొచ్చి తిరుపతి వెంకన్న ముందు పెట్టి పవన్ క్షమాపణ చెప్పాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. జనసైనికులను పవన్ మోసగిస్తున్నాయని ఆయన అన్నారు. జనసైనికుల్లారా పవన్ను ప్రశ్నించండి అని ఆయన పిలుపునిచ్చారు. పవన్ను ప్రశ్నించే వంతు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు ఎప్పుడొస్తుందో మరి!