చినబాబు మాయమాటలకు ఇదే పెద్ద రుజువు!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్ వాడీలు తీవ్రస్థాయిలో సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం వారి సమ్మె విరమింపజేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసింది. వారితో చర్చోపచర్చలు జరిపింది. వారి అనేక డిమాండ్లను ఒప్పుకుంది. కానీ.. అంగన్ వాడీలు…

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్ వాడీలు తీవ్రస్థాయిలో సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం వారి సమ్మె విరమింపజేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసింది. వారితో చర్చోపచర్చలు జరిపింది. వారి అనేక డిమాండ్లను ఒప్పుకుంది. కానీ.. అంగన్ వాడీలు మాత్రం తాము పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్నట్టుగా మొండిపట్టుదలను వీడడం లేదు.

అయితే.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గళమెత్తుతారా? ఆ మంటల్ని ఇంకాస్త ఎగదోసి వినోదిద్దామా? అని గోతికాడ నక్కలాగా కాచుకుని ఉండే తెలుగుదేశం పార్టీకి ఇది చాలా హాయిగా ఉంది. చినబాబు నారా లోకేష్ కూడా.. అంగన్వాడీల సమ్మెనుంచి గరిష్టంగా ఎడ్వాంటేజీలను పిండుకోవాలని చూస్తున్నారు. ఆయన తాజాగా మాట్లాడుతూ.. 40 రోజులుగా ధర్నా చేస్తున్నా స్పందించరా? అని అడుగుతున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత.. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తాం అంటున్నారు.

ఆహా.. నారా లోకేష్ ఎంతటి అద్భుతమైన నాయకుడు చెప్మా! జగన్ కు చేతకాని పని తాను చేసేస్తానని చెబుతున్నాడే. అంగన్వాడీల సమస్యలు తీర్చేస్తా అంటున్నాడే అని ఎవ్వరైనా నివ్వెరపోతే పప్పులో కాలేసినట్టే. ఇక్కడే చినబాబు మాటల గారడీ కనిపిస్తోంది. ఉద్యోగాలు పోతాయని బెదిరించడం, ఎస్మా ప్రయోగించడం తప్పు అని అంటున్న చినబాబు.. తాము అధికారంలోకి వస్తే.. న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని అనడమే పెద్ద కామెడీ. ‘న్యాయమైన’ అనే పదానికి లోకేష్ అనుకుంటున్న నిర్వచనం ఏమిటి? అనేది ప్రశ్న.

అంగన్వాడీల డిమాండ్లు ఏమిటో ఆయనకు తెలుసు. ఎందుకంటే వారు నలభై రోజులుగా పదేపదే తమ డిమాండ్లను వినిపిస్తూనే ఉన్నారు. జగన్ సర్కారు చర్చలకు పిలిచి.. అనేక సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పినా వారు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి నేపథ్యంలో.. వారి సకల డిమాండ్లలో న్యాయంగా చినబాబుకు అనిపించినవి ఏవో ఆయన తేల్చడం లేదు. వారి ప్రధాన డిమాండ్.. జీతాలు పెంచడం, పెన్షను సదుపాయం కల్పించడం వంటివి. మరి ఆ కీలక డిమాండ్లపై చినబాబు స్పందన ఏమిటి? తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా వాటిని నెరవేర్చే అవకాశం ఇసుమంత కూడా లేదు.

తండ్రీకొడుకులు ఇద్దరూ ఆ దిశగా ఒక్కమాట కూడా చెప్పడం లేదు. న్యాయమైన డిమాండ్లు అనే పడికట్టు మాటలతో అంగన్వాడీలను మభ్యపెట్టి, మాయచేసి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. తన హయాంలో దీక్షచేసిన అంగన్వాడీలను  పోలీసులతో కొట్టించిన చరిత్ర చంద్రబాబునాయుడుది. ఆయన యింకా ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా అంగన్వాడీలను మాటలతో మోసం చేస్తారే తప్ప వారి బాధలను ఆలకించరని వారి బుద్ధి తెలిసిన వారు అనుకుంటున్నారు