నిర్మాత వదిలేసారు.. ఫ్యాన్స్ పట్టుకున్నారు

గుంటూరు కారం సినిమా గురించి విడుదలకు ముందు నిర్మాత నాగవంశీ చాలా మాట్లాడారు. నిజానికి ఆయన మాట్లాడలేదు. కానీ ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరూ దాని గురించే అడిగారు. ఆయన అదే చెప్పారు. Advertisement…

గుంటూరు కారం సినిమా గురించి విడుదలకు ముందు నిర్మాత నాగవంశీ చాలా మాట్లాడారు. నిజానికి ఆయన మాట్లాడలేదు. కానీ ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరూ దాని గురించే అడిగారు. ఆయన అదే చెప్పారు.

సినిమా విడుదల టైమ్ చాలా టైట్ కావడంతో దర్శకుడు త్రివిక్రమ్ కానీ, మిగిలిన నటులు కానీ ఎవ్వరూ మీడియా ముందుకు వచ్చే అవకాశం లేకపోయింది. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా అనే కారణంగా వచ్చిన బజ్ నే తప్ప, ప్రత్యేకంగా ఆ సినిమా కోసం చేసిన పీఆర్ వ్యవహారాలు ఏమీ లేవు.

నిజానికి విడుదలకు ముందు ఈ సినిమాకు చేయాల్సింది ఏమీ లేదు. కానీ విడుదల తరువాత సినిమాకు టాక్ కాస్త తక్కువ రావడం వల్ల చేయాల్సింది చాలా వుంది. అదే చేయలేదు.. చేయడం లేదు అన్న మాట ఫ్యాన్స్ వర్గాల్లో వినిపిస్తోంది.

రమ్యకృష్ణ, శ్రీలీల, మీనాక్షి, రావు రమేష్, ఇలా చాలా మంది వున్నారు సినిమాలో. థమన్ వుండనే వున్నారు టీమ్ లో. వీళ్లందరు మీడియా ముందుకు రావచ్చు. మీడియాను ఫేస్ చేయచ్చు. అది ప్లస్ అయినా, మైనస్ అయినా సినిమాకు పబ్లిసిటీనే. త్రివిక్రమ్ మీడియా ముందుకు వస్తే ఆ హడావుడి వేరుగా వుంటుంది. మీడియా నుంచి గట్టిగా ప్రశ్నలు ఎదురైతే అవుతాయి. కానీ త్రివిక్రమ్ లాంటి మాటకారి వాటిని ఎదుర్కోవడానికి పెద్దగా కష్టపడక్కరలేదు. కానీ ఎందుకో ఆ దిశగా ప్రయత్నం కనిపించడం లేదు.

మహేష్ తో మరో సినిమా వుంటుందో వుండదో అన్నది ఇప్పుడు తెలియదు. అదంతా మూడేళ్ల తరువాత సంగతి. పైకి ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఖండించినా ఈ సినిమా విషయంలో బోలెడు కిందా మీదా పడ్డారు అన్నది వాస్తవం. అదంతా గతం. ఇక ఇప్పుడు ఈ సినిమాను పట్టుకుని వేలాడే ఆలోచన నిర్మాతకు వున్నట్లు కనిపించడం లేదు.

కానీ గమ్మత్తుగా మహేష్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం సినిమాను వదిలిపెట్టలేదు. ఎక్కడెక్కడ ఫుల్స్ వస్తున్నాయో అన్నీ కలిపి ఓ జాబితా చేస్తూనే వున్నారు. మార్నింగ్ షో నుంచి సెకెండ్ షో వరకు ట్రాక్ చేసి సోషల్ మీడియాలోకి తెస్తూనే వున్నారు. ఏదో ఒక న్యూట్రల్ హ్యాండిల్ నుంచి పాజిటివ్ ట్వీట్‌లు పడుతూనే వున్నాయి.

ఇక్కడ అదృష్టం ఏమిటంటే సినిమా డెఫిసిట్ లోకి పోలేదు. కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే థియేటర్లు ఇంకా తగ్గించకపోవడం. బహుశా ఫస్ట్ వీక్ తరువాతనే తగ్గిస్తారేమో? ఎక్కువ ధియేటర్లు పరిచేసి అలాగే వుంచేయడం వల్ల ఫుల్స్ తక్కువ కనిపిస్తున్నాయి.

ఇక్కడ సినిమాకు ప్లస్ మైనస్ మహేష్ బాబే. ఆయన హీరో కనుకనే ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. కానీ ఆయన కిందకు దిగి పబ్లిసిటీ చేసేందుకు వీలు కాదు. ఇదే మిడ్ రేంజ్ హీరో అయితే ఊళ్లు తిరిగేసి సినిమాను నిలబెట్టుకునే అవకాశం వుండేది. నాని, నిఖల్ లాంటి వాళ్లు ఇదే చేస్తారు కూడా.

అందువల్ల ఇక ఏం పబ్లిసిటీ చేసినా నిర్మాత వైపు నుంచే జరగాలి. త్రివిక్రమ్ రంగంలోకి దిగాలి. మిగిలిన నటులంతా తమ అనుభవాలు మీడియాతో పంచుకోవాలి. అవసరం అయితే నిర్మాత నాగవంశీ కూడా మరో విడత ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ సినిమాను నిలబెట్టాల్సి వుంది.