మాట నిలిపిన కొడుకు కథ

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్‌.ఆర్…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు.

2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగళవారం ‘యాత్ర 2’ చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు.

మహి వీ రాఘవ్ మాట్లాడుతూ.. ‘తెలిసిన కథే అయినా.. సినిమాను ఎలా తీశామన్నది ఎవ్వరికీ తెలియదు. ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ ఎమోషన్‌తో నడిపించామన్నది తెలియదు. ఈ టీజర్, ట్రైలర్‌లో చూసిన సీన్లు ప్రజలకి తెలిసి ఉండకపోవచ్చు. ఓ చెవిటి అమ్మాయితో ఉన్న సీన్, ఓ అంధుడితో సీన్ ఇవన్నీ బయటి ప్రజలకు తెలియవు. ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ని తీశాను.

ట్రైలర్‌లో చూపించిన ఆ ఎమోషనల్ సీన్లు నిజంగానే జరిగాయా? లేదా? అన్నది పక్కన పెడితే. ఆ సీన్‌తో ఎమోషన్‌ను జనాలకు కనెక్ట్ చేశామా? అన్నదే సినిమా ఉద్దేశం. వైఎస్సార్ పేదల కోసం, వికలాంగుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని చెప్పే ఉద్దేశంలో ఆ సీన్ అనుకోవచ్చు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది ఆయన వెనకాల నిలిచారు అనేది చెప్పడం కోసం ఆ అంధుడి పాత్రని చూపించాం.

ఇక ఈ చిత్రంలో వైఎస్సార్ మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు. ఇందులో కేవలం ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఢిల్లీని ఎదిరించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదు. ఇందులో నేను ఎవ్వరినీ కించపరిచేలా పాత్రలు సృష్టించలేదు. నిజానిజాలు జనాలకు తెలుసు. ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించలేదు అన్నారు మహి రాఘవ.

హీరో జీవా మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ పాత్రలో నటించడం కష్టంగా అనిపించింది. యూట్యూబ్, మీడియా నుంచి వీడియోలు రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నాను. జగన్ ఎలా మాట్లాడతారు.. ఎలా నడుస్తారు.. ఇలా ప్రతీ ఒక్క విషయం మీదో ఎంతో శ్రద్ద తీసుకున్నాను. ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది.

డైరెక్టర్ ఎప్పుడైతే షాట్‌కి ఓకే చెప్పారో అప్పుడు నాకు రిలీఫ్ అనిపించింది. నేను జగన్ మోహన్ రెడ్డి లా కనిపిస్తున్నానని అప్పుడే నాకు అర్థమైంది. ఆ తరువాత నేను మానిటర్ కూడా చూడలేదు. ప్రతిపక్షం నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అని మమ్ముట్టి గారిని అడిగాను. మనం యాక్టర్స్.. ఇది క్రియేటివ్ స్పేస్.. ఇది కేవలం సినిమాలానే చూడు అని ఆయన చెప్పారు.