కేబినెట్ విస్తరణకు అడ్డంకులు తొలగినట్లేనా?

తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతానికి 12 మంది మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రి కాకుండా 11 మంది మంత్రులు తొలివిడతలో ప్రమాణం చేశారు. ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి.…

తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతానికి 12 మంది మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రి కాకుండా 11 మంది మంత్రులు తొలివిడతలో ప్రమాణం చేశారు. ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం పాలన ప్రారంభించి ఇప్పటికే యాభై రోజులు గడిచాయి. ఆ ఆరు కేబినెట్ స్థానాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ఇంకా నిరీక్షిస్తోంది? అనేది అర్థం కాని ప్రశ్న.

కొన్ని సమీకరణలు సెట్ కానందున మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయకుండా ఆపారని అనుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం కొంత పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడే కేబినెట్ విస్తరణను కూడా ముగిస్తారా? లేదా, ఎవ్వరిలోనూ అసంతృప్తులు రేగకుండా, రేగే అసంతృప్తులు పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి చేటు చేయకుండా.. ఎన్నికల తర్వాతకు విస్తరణను వాయిదా వేస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

రేవంత్ రెడ్డి కొలువు తీరిన తర్వాత కేబినెట్ లో ఆరు ఖాళీలు ఉంచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. వాటిని ఎవరితో భర్తీ చేయబోతున్నారనేది గట్టి చర్చే. సహజంగానే ఆశావహులుచాలా మంది ఉన్నారు. వీరి ఒత్తిళ్లను పట్టించుకుంటూ కులాల సమతూకం పాటిస్తూ మాత్రమే భర్తీ చేస్తారా? లేదా ఏదైనా కొత్త పోకడలను అనుసరించే అవకాశం ఉన్నదా? అని విశ్లేషకులు గమనిస్తున్నారు.

రేవంత్ సర్కారు కొత్తగా వ్యవహరించేట్లయితే.. ప్రొఫెసర్ కోదండరామ్ కు కూడా మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ మేధావిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో జేఏసీ కన్వీనరుగా ఎంతో కీలకంగా వ్యవహరించిన ఆయన సేవలకు పదేళ్లుగా ఎలాంటి గుర్తింపూ దక్కలేదన్నది వాస్తవం. ఆయన సొంత పార్టీ కూడా ప్రజల మద్దతు పొందలేపోయింది.

అయితే.. ఆ పార్టీని విలీనం చేసుకునే వ్యవహారం నడిపించకుండానే.. రేవంత్ సర్కారు కోదండరాంను ఎమ్మెల్సీ చేసింది. ఇప్పుడు మంత్రిపదవి కూడా ఇచ్చిన ఆయన మేథస్సును ప్రభుత్వానికి వాడుకుంటారా? అనేది చూడాలి.

అలాగే ఈ ప్రభుత్వంలో మైనారిటీలకు చెందిన మంత్రి లేరు. నిజామాబాద్ లో షబ్బీర్ ఆలీ గెలిచి ఉంటే తప్పకుండా మంత్రి అయ్యేవారు. కానీ ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ.. తన కామారెడ్డి సీటును త్యాగం చేసినందువల్ల మంత్రి పదవి కావాలని ఆయన కోరుకుంటున్నారు. అదే సమయంలో తాజాగా గవర్నరు కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలలో కోదండరాంతో పాటు పదవిలోకి వచ్చిన మీర్ అమీర్ ఆలీఖాన్ కూడా మంత్రి పదవి రేసులోకి వస్తారేమో తెలియదు. ఎమ్మెల్సీలకు కూడా మంత్రి పదవులు ఇచ్చేట్లయితే.. జీవన్ రెడ్డి కూడా రేసులోకి వస్తారు.

విస్తరణ ఎఫ్పుడనేది తేలాల్సి ఉంది. కేబినెట్ బెర్తులు దక్కని వారి అసంతృప్తి పార్లమెంటు ఎన్నికల మీద ప్రభావం చూపించగలదనుకుంటే ఆ తర్వాతకే ముహూర్తం షెడ్యూలు చేస్తారు. లేదంటే, ఎన్నికలకు ముందే విస్తరణ జరగవచ్చు. ఏది ఏమైనా.. గులాబీ పార్టీ నుంచి ఫిరాయించి వచ్చే వారికి మాత్రం కేబినెట్ అవకాశం ఉండబోదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.