పుకార్లపై ఘాటుగా స్పందించిన మాజీ భార్యాభర్తలు

మరో సెలబ్రిటీ జంట విడిపోయిన సంగతి తెలిసిందే. జీవీ ప్రకాష్, అతడి భార్య సైంధవి తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేశారు. ఎవరి దారులు వాళ్లు చూసుకున్నారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని వీళ్లిద్దరూ…

మరో సెలబ్రిటీ జంట విడిపోయిన సంగతి తెలిసిందే. జీవీ ప్రకాష్, అతడి భార్య సైంధవి తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేశారు. ఎవరి దారులు వాళ్లు చూసుకున్నారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని వీళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారో, ఆ క్షణం నుంచి వీళ్ల వైవాహిక బంధంపై, వ్యక్తిగత జీవితాలపై కథనాలు మొదలయ్యాయి.

యూట్యూబ్ లో పుంఖానుపంఖాలుగా వస్తున్న ఈ కథనాలు చూసి ఈ జంట హర్ట్ అయింది. ఇప్పటికే వీటిని జీవీ ప్రకాష్ ఖండించాడు. కేవలం సెలబ్రిటీ హోదా కారణంగా వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నాడు. తమ విడాకులకు సంబంధించి అసంబద్ధ కంటెంట్ ను పోస్ట్ చేయడం ఆపేయాలని కోరాడు.

అటు జీవీ ప్రకాష్ మాజీ భార్య సైంధవి కూడా ఈ కథనాలపై స్పందించింది. వ్యూస్ కోసం, తృప్తి కోసం తమ క్యారెక్టర్ ను కించపరచడం బాధగా ఉందన్నారు. తమ విడాకులపై సొంతంగా కథలు అల్లేస్తున్న ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ పై విరుచుకుపడ్డారు.

“మా విడాకులపై చాలా యూట్యూబ్ ఛానెల్స్ తమకు ఇష్టమొచ్చినట్టు స్టోరీలు ఇచ్చేస్తున్నాయి. ప్రైవసీ కావాలని కోరిన తర్వాత కూడా ఇలా చేయడం బాధ కలిగించింది. అందుకే మరోసారి స్పష్టత ఇస్తున్నాను. బయట వ్యక్తులు, పరిస్థితుల వల్ల మేం విడిపోలేదు. మా అభివృద్ధి కోసం కలిసి తీసుకున్న నిర్ణయమిది. జీవీ ప్రకాష్, నేను 24 ఏళ్లుగా స్నేహితులం. స్కూల్ డేస్ నుంచి మేం ఫ్రెండ్స్. ఇకపై కూడా మా స్నేహం అలానే కొనసాగుతుంది.”

ఇలా యూట్యూబ్ కథనాలపై స్పష్టత ఇచ్చింది సైంధవి. నిరాధారమైన కథనాలతో ఓ వ్యక్తి క్యారెక్టర్ ను కించపరిస్తే సహించనని ఈ సందర్భంగా ప్రకటించింది. జీవీ ప్రకాశ్, సైంధవి ప్రకటన తర్వాతైనా ఈ కథనాలకు ఫుల్ స్టాప్ పడితే బాగుణ్ను.