చేయి విరగ్గొట్టుకున్న ఐశ్వర్య రాయ్

ఐశ్వర్య రాయ్ అందానికి ఫిదా అవ్వనివాడు ఉండదు. దశాబ్దాలుగా తన లుక్స్ తో ఉర్రూతలూగిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. వయసు పెరిగినా తన స్టయిల్ స్టేట్ మెంట్ తో ఆకర్షిస్తూనే ఉంది. ఇలాంటి అందగత్తె…

ఐశ్వర్య రాయ్ అందానికి ఫిదా అవ్వనివాడు ఉండదు. దశాబ్దాలుగా తన లుక్స్ తో ఉర్రూతలూగిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. వయసు పెరిగినా తన స్టయిల్ స్టేట్ మెంట్ తో ఆకర్షిస్తూనే ఉంది. ఇలాంటి అందగత్తె చేతికి కట్టుతో కనిపిస్తే ఎలా ఉంటుంది? అలాంటి షాకింగ్ దృశ్యం ఈరోజు కనిపించింది. 

ఎప్పట్లానే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు బయల్దేరింది ఐష్. ఎయిర్ పోర్టులో కూతురు ఆరాధ్యతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. కానీ ఆమె చేతికి కట్టుతో కనిపించింది. ఆమె చేతికి గాయమైందనే విషయం బాహ్య ప్రపంచానికి ఇప్పుడే తెలిసింది. 

గాయానికి సంబంధించి ఎయిర్ పోర్టులో మీడియా అడిగిన ప్రశ్నలకు ఐశ్వర్య రాయ్ సమాధానం చెప్పలేదు. కూతురుతో పాటు నవ్వులు చిందిస్తూ లోపలకు వెళ్లిపోయింది. ఆమె ఇంట్లోనే జారి పడి ఉండొచ్చని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఇలాంటి యాక్సిడెంట్ బయట జరిగితే కచ్చితంగా తెలుస్తుంది కాబట్టి.

ఈ సంగతి పక్కనపెడితే, ఎయిర్ పోర్ట్ లుక్ లో భాగంగా ఐష్ ధరించిన డ్రెస్ అందర్నీ ఆకట్టుకుంటోంది. డిజైనర్ ఫల్గుణి తయారుచేసిన డ్రెస్ ఇది. ఆన్ లైన్ లో దీని రేటు 64వేల రూపాయలపైనే ఉంది. 

2002 నుంచి క్రమం తప్పకుండా కాన్స్ ఫెస్టివల్ కు హాజరవుతోంది ఐశ్వర్య. తొలిసారి ఆమె నీతా లుల్లా డిజైన్ చేసిన చీరను ధరించి రెడ్ కార్పెట్ పై నడిచింది. ఏటా ఆమె రెడ్ కార్పెట్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. ఈసారి ఆమె ఏ డ్రెస్ లో మెరుస్తుందనే విషయం కంటే, చేతికి ఉన్న ఆ దెబ్బతో ఆమె రెడ్ కార్పెట్ పైకి ఎలా వస్తుందనే ఆసక్తి అందర్లో ఉంది. ఈసారి ఐష్ తో పాటు కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ, అదితి రావ్ హైదరీ కూడా రెడ్ కార్పెట్ పై మెరవనున్నారు.