విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇందులో రెండవ మాటకు తావు లేదు. అయిదున్నర దశాబ్దాల క్రితం విశాఖ ఉక్కు కోసం ఉమ్మడి ఆంధ్రా రాష్టమంతటా పెను ఉద్యమాలే జరిగాయి. దానికి కేంద్రం తలొగ్గింది కూడా.
ఇపుడు మళ్ళీ ఉక్కు పరీక్ష ఎదురైంది. వర్తమాన రాజకీయాలు చూస్తే అమరణ దీక్షలు, సత్యాగ్రహాలూ చెల్లుతాయా అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ సంగతి ఎలా ఉన్నా రాజకీయం మాత్రం ఈ వంకతో జోరు చేస్తోంది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒక అడుగు ముందుకేశారు. దాంతో గట్టి దెబ్బ తగిలిన టీడీపీ పెద్దలకు కొత్త వ్యూహాలు తడుతున్నాయట.
ఉక్కు ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు వైసీపీని కార్నర్ చేయడానికి అటు మేయర్ సీటు పట్టడానికి కూడా వీలు అవుతుందని ప్లాన్ వేస్తున్నట్లుగా భోగట్టా. దాంతో విశాఖ ఉక్కు కోసం ఆ పార్టీ పెద్దలు అమరణ దీక్షకు రెడీ అంటున్నట్లుగా టాక్.
ఇప్పటికే ఉక్కు కార్మిక నాయకులు రిలే దీక్షలకు రెడీ అయిపోయారు. అయితే దీక్షలు చేసినా లేక ఉద్యమించినా రాజకీయాలు స్వప్రయోజనాలు చూసుకోకుండా అంతా ఒక్క త్రాటిపైకి వస్తేనే కేంద్రం మెడలు వంచడం సాధ్యమన్నది మేధావుల మాట. మరి అది జరిగే పనేనా.