ఎక్స్ ట్రాలు వద్దు.. సంజాయిషీ చాలు..!!

తండ్రి నుంచి వారసత్వంగా అబ్బిన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఎద్దేవా చేసేలా మాట్లాడుతూ వారి నోరు మూయించే ప్రయత్నం చేయగలను అనుకునే నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు. గులాబీ దళం అధికారంలో ఉన్న రోజులలో అంతా…

తండ్రి నుంచి వారసత్వంగా అబ్బిన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఎద్దేవా చేసేలా మాట్లాడుతూ వారి నోరు మూయించే ప్రయత్నం చేయగలను అనుకునే నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు. గులాబీ దళం అధికారంలో ఉన్న రోజులలో అంతా ఆయన అనుకున్న విధంగానే సాగింది. అందులో సందేహం లేదు. వారి చేతిలో అధికారం ఉన్నది కనుక వారి మాటకు ఎదురు చెప్పే వారు కూడా లేకుండా పోయారు. ఆడింది ఆటగా పాడింది పాటగా.. వెటకారం చేసినా సరే వారు మాట్లాడిందే మాటగా చలామణి అయింది.

ఇప్పుడు ప్రభుత్వం మారింది.. వాచాలత్వం ప్రదర్శిస్తే సంజాయిషీ చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే కేటీఆర్ మహిళా కమిషన్ ఎదుట హాజరై.. ఆర్టిసి బస్సులలో ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన క్షమాపణ కోరారు.

తాను యథాలాపంగా అన్న మాటలు ఎవరికైనా మనస్థాపం కలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఆయన.. ఇదే విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లినట్టుగా వెల్లడించారు.

పనిలో పనిగా చట్టాన్ని వ్యవస్థ లను గౌరవించే వ్యక్తిగా కమిషన్ ముందు హాజరు కావడానికి వస్తే దీన్ని కూడా రాజకీయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని కేటీఆర్ ఆరోపించారు. అక్కడికేదో యుద్ధానికి వెళుతున్న తరహాలో ఆయనకు మద్దతుగా బారాస మహిళా కార్పొరేటర్లు, నాయకులందరినీ కమిషన్ వద్దకు పోగేసుకుని వెళ్లిన కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచిత్రం.

రాష్ట్రంలో గత ఎనిమిది తొమ్మిది నెలల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించానని.. ఆ విషయాలపై ఫిర్యాదు చేసేందుకు మరోసారి రావాలని కమిషన్ చెప్పినట్లుగా కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. చూడబోతే .. చేసిన వ్యాఖ్యలకు సంజాయిషీ తప్ప అదనపు విషయాలు మాట్లాడవద్దని మహిళా కమిషన్ ఆయనను హెచ్చరించినట్లుగా కనిపిస్తోంది.

మహిళల ఉచిత బస్సు ప్రయాణం గురించి మంత్రి సీతక్క వారు బస్సుల్లో కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేమిటి అని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందించిన కేటీఆర్ కుట్లు అల్లికలతో పాటు కావలిస్తే బ్రేక్ డాన్స్ లు కూడా చేసుకోమని చెప్పండి.. మాకు అభ్యంతరం లేదు.. అంటూ మహిళలను చులకన చేసి మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇవాళ ఆయన మహిళా కమిషన్ హాజరై సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇతర అంశాల ప్రస్తావించబోతే కమిషన్ అడ్డుకొని కేవలం సంజాయిషీని మాత్రమే తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

8 Replies to “ఎక్స్ ట్రాలు వద్దు.. సంజాయిషీ చాలు..!!”

  1. నోటి దూల తగ్గించుకో అని పంచాంగం పంతులు గారు ఆల్రెడీ చెప్పారు

  2. సబితా మాడమ్స్ మాత్రం గత 20 ఏళ్లుగా మంత్రి పదవుల్ని అలంకరించి, ఇప్పుడు అమాయకురాలు వలె దీన ముఖం పెట్టారు.

  3. ఏటి దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నది గుర్తుకు వస్తుంది, ఈ మీడియా వరస చూస్తే!

Comments are closed.