ప్రియురాలిని చిత‌క‌బాదిన ప్రియుడి బంధువులు

ప్రేమ పేరుతో ఇద్ద‌రూ మూడేళ్ల పాటు తిరిగారు. తీరా పెళ్లి మాట ఎత్తేస‌రికి ప్రేమికుడు త‌ప్పించుకున్నాడు. ప్రియురాలిని కాద‌ని మ‌రో యువ‌తిని మెడ‌లో మూడు ముళ్లు వేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ విష‌యం తెలిసి పెళ్లి…

ప్రేమ పేరుతో ఇద్ద‌రూ మూడేళ్ల పాటు తిరిగారు. తీరా పెళ్లి మాట ఎత్తేస‌రికి ప్రేమికుడు త‌ప్పించుకున్నాడు. ప్రియురాలిని కాద‌ని మ‌రో యువ‌తిని మెడ‌లో మూడు ముళ్లు వేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ విష‌యం తెలిసి పెళ్లి అడ్డుకునేందుకు వెళ్లిన ప్రియు రాలిని వ‌రుడి బంధువులు చిత‌క్కొట్టారు. తెలంగాణ‌లోని ఖ‌మ్మంలో శుక్ర‌వారం చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నం రేపింది.

ఖ‌మ్మం జిల్లాలోని గార్ల మండలానికి చెందిన యువ‌తి, శ్రీ‌నాథ్ అనే యువ‌కుడు ప్రేమ‌లో ఉన్నారు. ప్రియుడి మాట‌లు న‌మ్మి వెంట తిరిగింది. అర్థం చేసుకోడానికి మూడేళ్ల ప్రేమ చాల‌ని, ఇక పెళ్లి చేసుకుందామ‌ని శ్రీ‌నాథ్ ముందు స‌ద‌రు ప్రేమికురాలు ప్ర‌తిపాద‌న పెట్టింది. అప్పుడే అత‌నిలో మోస‌కారిత‌నం బ‌య‌ట ప‌డింది. ప్రియురాలిని విడిపించుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. అప్ప‌టి నుంచి ప్రియురాలికి క‌నిపించ‌లేదు. ఆమె ఫోన్‌కాల్స్ రిసీవ్ చేసుకోలేదు. ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు బంద్ అయ్యాయి.

ఇవాళ ఖ‌మ్మంలో వేరే యువ‌తితో శ్రీ‌నాథ్‌కు పెళ్లి జ‌ర‌గ‌నుంద‌నే స‌మాచారం ప్రియురాలికి చేరింది. దీంతో ఖ‌మ్మంలో పెళ్లి వేడుక‌కు సిద్ధ‌మైన క‌ల్యాణ మండ‌పానికి ప్రియురాలు చేరుకుంది. త‌న‌ను ప్రేమించి, మ‌రో అమ్మాయి మెళ్లో తాళి ఎలా క‌డ‌తార‌ని నిల‌దీసింది. 

పెళ్లి కొడుకు మోసాన్ని అంద‌రి ఎదుట బ‌య‌ట పెట్టింది. దీన్ని జీర్ణించుకోలేని శ్రీ‌నాథ్ బంధువులు… క‌నీసం అమ్మాయి అని కూడా చూడ‌కుండా పెళ్లి మండ‌పం నుంచి ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ వెళ్లారు. అక్క‌డే పోలీసులు ఉన్నా ప్రేక్ష‌క‌పాత్ర పోషించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ముఖ్యంగా యువ‌తిని మ‌హిళ‌లే కొట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌య‌మై పోలీసుల‌కు బాధిత యువ‌తి ఫిర్యాదు చేసింది.