‘చెప్పను బ్రదర్’ అంటున్న హీరోయిన్ రకుల్

చెప్పను బ్రదర్ అనేది అల్లు అర్జున్ ట్రేడ్ మార్క్ డైలాగ్. ఈ ఒక్క మాట అని, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాడు బన్నీ. ఇదంతా గతం. ఇప్పుడీ డైలాగ్ మరోసారి తెరపైకొచ్చింది.…

చెప్పను బ్రదర్ అనేది అల్లు అర్జున్ ట్రేడ్ మార్క్ డైలాగ్. ఈ ఒక్క మాట అని, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాడు బన్నీ. ఇదంతా గతం. ఇప్పుడీ డైలాగ్ మరోసారి తెరపైకొచ్చింది. ఈసారి ఈ డైలాగ్ వాడింది ఎవరో కాదు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

కొన్నాళ్ల కిందట తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది రకుల్. జాకీ భగ్నానీతో రిలేషన్ షిప్ లో ఉన్నానని ప్రకటించింది. అప్పట్నుంచి ఆమె ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా బాయ్ ఫ్రెండ్ పై ప్రశ్నలు ఎక్కువయ్యాయి. దీంతో విసుగెత్తిపోయిన రకుల్.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నహీ భయ్యా (చెప్పను బ్రదర్) అనే డైలాగ్ వాడింది. ఆ తర్వాత దానిపై సుదీర్ఘంగా వివరణ కూడా ఇచ్చింది.

“ఇది రొటీన్ వ్యవహారం. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. అమ్మ, నాన్న, తమ్ముడు ఎలా ఉంటారో అదే విధంగా పార్టనర్ కూడా ఉంటాడు కదా. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడ్డం అనవసరం. ప్రతిసారి అడగొద్దు ప్లీజ్. ఆ టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా మాట్లాడతాను. మా రిలేషన్ షిప్ గురించి ఏదైనా చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాను. ప్రతి ఇంటర్వ్యూలో నా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా.”

ఇలా కాస్త అసహనం ప్రదర్శించింది రకుల్ ప్రీత్. ముఖంపై చిరునవ్వు ఉన్నప్పటికీ, ఆమె మాటల్లో వ్యతిరేకత మాత్రం స్పష్టంగా కనిపించింది. తన వ్యక్తిగత విషయాల్ని బహిరంగంగా చర్చించడానికి పెద్దగా ఇష్టపడని రకుల్.. జాకీతో లైఫ్ బాగుందని, ఇద్దరం ప్రైవేట్ లైఫ్ ను బాగా ఆస్వాదిస్తున్నామని గతంలోనే ప్రకటించింది. అంతకుమించి బయటకు చెప్పడానికి ఇంకేం ఉంటుందని ప్రశ్నిస్తోంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం వరుస హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. తాజాగా మరోసారి సౌత్ సినిమాపై కన్నేసింది. అజిత్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. దీనిపై త్వరలోనే అధికారిక వ‌చ్చే ఆవ‌కాశం ఉంది.