భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి శకుని పాత్ర పోషిస్తున్నారనే అనుమానం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇందుకు ఆయన తాజా మాటలే నిదర్శనమనే చర్చ సాగుతోంది. మహాభారతంలో శకుని పాత్ర అత్యంత కీలకమైంది.
కౌరవుల మాతృమూర్తి గాంధారికి స్వయాన సోదరుడే శకుడు. కౌరవుల వినాశనాన్ని కోరి, వారి పంచన చేరి, మంచిగా ఉంటూనే మేనల్లుళ్లైన దుర్యోధనుడు, దుశ్శాసనులకు చెడు సలహాలు ఇస్తూ … చివరికి తాను కోరుకున్నట్టే జరుగుతుంది.
బీజేపీలో శకుని గురించి చర్చించుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తుల ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీజేపీపై ఒర రకమైన ఎమోషనల్ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమించి, సుమారు 40 మంది వరకు బలిదానం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో, పుండుమీద కారం చల్లినట్టు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి మాటలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఏపీలో విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెల్లువెత్తుతున్న నిరసనను గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. అయితే సోము , సుజనా మాటలకు ఎక్కడా పొంతన కుదరకపోవడం గమనార్హం. దీంతో ఏపీలో బీజేపీ మరింత పలుచన అవుతోంది.
ఒక పథకం ప్రకారం బీజేపీని బద్నాం చేసేందుకు సుజనాచౌదరి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే అనుమానాలు సొంత పార్టీ శ్రేణుల్లో కలగడం గమనార్హం. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సుజనా, సోము మాటలను ఒకసారి పరిశీలిద్దాం.
‘విశాఖ స్టీల్పై కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. తెదేపా, వైకాపా విభేదిస్తే ఈ ప్రక్రియ ఆగేది కాదు. 1971లో ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదు. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం ఆర్థిక విధానాలు మారుతూ వస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తప్పవన్నదే కేంద్ర ఉద్దేశం’ అని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మరో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సురేష్ప్రభుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో విలేకరులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ఏమన్నారంటే…
‘విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంలో ప్రజల మనోభావాలకు తగినట్టు పోరాటం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడంలో ప్రజల ఆలోచనలను ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 14న ఢిల్లీలో జరిగే పార్టీ సమావేశంలోనూ చర్చిస్తాం’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు.
ప్రైవేటీకరణపై సుజనా చౌదరి దూకుడుగా వ్యవహరించడం వెనుక రాజకీయాలను బీజేపీ ఏపీ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. బీజేపీపై వ్యతిరేకత పెరిగేలా సుజనా మాట్లాడ్డం వల్ల ఏ పార్టీకి ప్రయోజనం కలిగించాలని తహతహలాడుతున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసుననే అభిప్రాయాలు బీజేపీలో వ్యక్తం కావడం గమనార్హం.
అసలు నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి చంద్రబాబు పంపడం వెనుక వ్యూహం ఉందని ఎప్పటి నుంచో అందరూ చర్చిస్తున్నదే. అవకాశం వస్తే లక్ష్యాన్ని నెరవేర్చడంలో సుజనా ముందుంటారనేది బహిరంగ రహస్యమే.