“సర్.. 2 రోజులుగా నా భార్య కనిపించడం లేదు. మీరే ఎలాగైనా వెదికిపెట్టాలి.” పోలీసుల్ని దీనంగా వేడుకున్నాడు ఆ భర్త. అతడి ఆవేదన చూసి పోలీసులు కూడా నిజమని నమ్మారు. ఎందుకంటే, అప్పటికి అతడికి పెళ్లయి ఏడాది కూడా నిండలేదు. కాబట్టి పోలీసులకు అనుమానం రాలేదు. కానీ ఇక్కడ భార్యను చంపింది ఆ భర్తే.
పోలీసులకు సినిమా స్టోరీ చెప్పిన ఆ నిందితుడు ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంతకీ అతడు ఎలా దొరికాడు? ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన నవ్యా రెడ్డికి, అతడి సొంత బావతో పెళ్లయింది. బావ నాగశేషురెడ్డితో నవ్యారెడ్డి వివాహం గతేడాది డిసెంబర్ లో జరిగింది.
కానీ ఇక్కడ పెళ్లికూతురుతో పాటు ఆమె తరఫు బంధువులకు తెలియని విషయం ఏంటంటే.. నాగశేషురెడ్డికి అప్పటికే మరో అమ్మాయితో సంబంధం ఉంది. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటూనే, మరోవైపు తన మరదలు న్వయను పెళ్లాడాడు నాగశేషు.
పెళ్లయిన కొన్నాళ్లకు, తను సంబంధం పెట్టుకున్న అమ్మాయి కోసం భార్య నవ్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 2వ తేదీన బైక్ పై భార్యను బయటకు తీసుకెళ్లాడు. ఫ్రూట్ జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు.
ఆమె అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత శివార్లలోని అటవీప్రాంతానికి తీసుకెళ్లి చెట్టుకు ఉరివేసి హత్యచేశాడు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు.. భార్య నవ్య మొబైల్ నుంచి ఆమె తండ్రికి మెసేజ్ పెట్టాడు. ఇంజనీరింగ్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు భార్య సెల్ నుంచి నాగశేషు మెసేజ్ పెట్టాడు.
ఆ తర్వాత తీరిగ్గా పోలీసుల వద్దకెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదుచేశాడు. సీసీటీవీ ఫూటేజ్ చూసిన పోలీసులకు, నాగశేషే తన భార్యను బైక్ పై తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా.. హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు నాగశేషు. అతడు చెప్పిన చోటుకు వెళ్లి చూడగా, నవ్యా రెడ్డి మృతదేహం పోలీసులకు కనిపించింది.