ఏపీలో మంత్రుల రాజీనామా హాట్ టాఫిక్గా మారింది. మంత్రి పదవులకు కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యిందనే అభిప్రాయాలు వెల్లువెత్తు తున్నాయి. ఈ నెల 7న చివరి కేబినెట్ సమావేశం జరగనుందని సమాచారం. అదే రోజు మంత్రివర్గమంతా మూకుమ్మడిగా రాజీనామా చేయనుంది.
అనంతరం రాజీనామాలు తీసుకెళ్లి 8న గవర్నర్ను సీఎం జగన్ కలవనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కొత్త కేబినెట్ కూర్పుపై గవర్నర్కు సీఎం వివరించనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న కొత్త కేబినెట్ కొలువుతీరే అవకాశాలున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మంత్రివర్గంలో సుమారు 90 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నదే. అయితే కేబినెట్లో తిరిగి బెర్త్లు దక్కించుకోనున్న ఆ ఒకరిద్దరు మంత్రులెవరనేది అంతుచిక్కడం లేదు. మంత్రి పదవుల విషయమై ఎవరెవరిని తీసుకోనున్నారనే అంశమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే కసరత్తు చేస్తున్నారని సమాచారం. అందుకే కొత్త కేబినెట్ కూర్పుపై సమాచారం బయటకు రావడం లేదు.
కానీ మంత్రి వర్గం కూర్పులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేస్తారని ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. దీంతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల్లో రోజురోజుకూ ఆశలు పెరుగుతున్నాయి. జగన్ మనస్తత్వం తెలిసిన వారు, ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
అసలు ఎవరూ ఊహించని ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనే చర్చకు తెరలేచింది. మరో వారంలో ఉత్కంఠకు జగన్ తెరదించే అవకాశాలున్నాయి.