ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సూచనల మేరకు పలువురు అధికారుల బదిలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. నిమ్మగడ్డ ఆదేశాలనుసారం పలువురు అధికారుల బదిలీలు చేపట్టక తప్పడం లేదు ప్రభుత్వానికి.
ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ లను బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీరితో పాటు..గుంటూరు, చిత్తూరు కలెక్టర్ల బదిలీ కూడా తప్పదని తెలుస్తోంది. అలాగే తిరుపతి ఎస్పీ బదిలీని కూడా ఏపీ ఎన్నికల కమిషనర్ కోరినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వీరి స్థానంలో వేరే అధికారుల నియామకం జరగనుంది. అందుకు సంబంధించి మూడు మూడు పేర్లను ఇవ్వమని కమిషనర్ ప్రభుత్వాలను కోరారట. ఎస్ఈసీ ఎంపిక చేసిన వారిని ఈ బాధ్యతల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది.
బహుశా ఇది ప్రారంభమే కావొచ్చు. ఏపీలో మరింత మంది అధికారులపై ఈ తరహా బదిలీ వేట్లు ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ లోని కొంతమంది అధికారులపై కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకంగా సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.