జనసేనాని పవన్కల్యాణ్ చేసిన ప్రకటనతో కాపు సామాజిక వర్గం ఖుషీ అవుతోంది. తాను కులాలు, మతాలకు అతీతమని జనసేనాని పవన్కల్యాణ్ ఎంత చెబుతున్నప్పటికీ, రాజకీయంగా ఆయన బలం కులమే అని చెప్పక తప్పదు.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు, తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో పవన్ పక్కాగా కుల రాజకీయాలకు తెరలేపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కులరాజకీయాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయనేది బహిరంగ రహస్యమే.
అందులోనూ ఏపీలో బీసీల తర్వాత మెజార్టీ ఓటు బ్యాంకు కాపులదే. తమ సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా జనసేన -బీజేపీ కూటమి వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీల అధినేతలు చురుగ్గా పావులు కదుపుతున్నారు.
ఇందులో భాగంగా జనసేనాని పవన్ మరో ముందడుగు వేశారని చెప్పొచ్చు. తాను మొదట కాపునే అని, ఆ తర్వాతే మిగిలినవన్నీ అనే సంకేతాన్ని పంపేందుకు ఆయన నేరుగా రంగంలోకి దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కాపు కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో చర్చించేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. కాపు సామాజిక వర్గాన్ని ఇద్దరు కాపు నాయకులు నాయకత్వం వహిస్తున్న జనసేన -బీజేపీ కూటమికి గట్టి మద్దతుదారుగా నిలిపేందుకు చాపకింద నీరులా ఆ సామాజిక వర్గ నేతలు తీవ్ర కృషి చేస్తున్నారు.
ఇందులో భాగంగా కాపు సంక్షేమ ప్రతినిధులతో కలిసి చర్చించాలని జేఏసీ అధ్యక్షుడు, మాజీ హోంమంత్రి చేగొండి హరిరామ జోగయ్య రాసిన లేఖపై పవన్ సానుకూలంగా స్పందించడం వెనుక పక్కా వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ ఇదే వైఖరితో ముందుకు సాగితే మాత్రం కనీసం కాపులైనా బలంగా అండగా నిలుస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.