బీజేపీకి డిమాండ్లు పెడుతున్న తమ్ముళ్ళు

ఏపీ సీఎం జగన్ మీద కేంద్రంలోని బీజేపీ యాక్షన్ తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు కోరుతున్నారు. నిన్న చంద్రబాబు ఈ డిమాండ్ చేస్తే నేడు సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ…

ఏపీ సీఎం జగన్ మీద కేంద్రంలోని బీజేపీ యాక్షన్ తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు కోరుతున్నారు. నిన్న చంద్రబాబు ఈ డిమాండ్ చేస్తే నేడు సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు నాలుగేళ్ల తరువాత ఏపీలోని అవినీతి అరాచకాలు కనిపిస్తున్నాయని అయ్యన్నపాత్రుడు అంటున్నారు. ఏపీలో అవినీతి గురించి తాము మొదటి నుంచి మొత్తుకుంటూంటే బీజేపీ పెద్దలకు ఇపుడు తెలిసొచ్చిందని వ్యంగ్యం ప్రదర్శించారు.

ఇప్పటికైనా కళ్ళు తెరచినందుకు సంతోషం. ఏపీని బాగు చేయడానికి బీజేపీ పెద్దలు యాక్షన్ తీసుకుంటారా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మీద జగన్ మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలని తెలుగుదేశం నేతలు కోరుకుంటున్నారో కానీ బీజేపీ పెద్దలను అంతా కలసి డిమాండ్ చేస్తున్నారు.

సీనియర్ నేత కళా వెంకటరావు అయితే జగన్ కి ఎన్నికలు అంటే భయం అంటున్నారు. ఎన్నికలు పెడితే ఓడిపోతామని కంగారు పడుతున్నారని అంటున్నారు. ముందస్తు ఎన్నికలు ఏపీలో వస్తాయని వైసీపీ ఏనాడూ చెప్పలేదు అదంతా టీడీపీ నేతలు ఊహించుకుంటూ వచ్చారు.

తీరా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అని వైసీపీ నేతలు ప్రకటించేసరికి జగన్ వర్క్ షాప్ సందర్భంగా మనకు తొమ్మిది నెలల సమయం ఉందని క్లారిటీ ఇచ్చేసరికి జగన్ కి ఎన్నికల భయం అని కొత్త రాగం అందుకుంటున్నారు అని అంటున్నారు.

ఎన్నికలు భయం అంటే 2024 లో జరగకుండా ఉంటాయా అని వైసీపీ నేతలు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు పెట్టమనే కోరుకుందని, కానీ టీడీపీ కోసం ఎన్నికలు రావు కదా షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వైసీపీ నేతలు అంటున్నారు.

ఎన్నిలకు షెడ్యూల్ ప్రకారం జరిగితే టీడీపీకి కంగారు ఎందుకు ఓడిపోతామనా అన్న ప్రశ్నను వైసీపీ నేతలు వేస్తున్నారు. జగన్ నామస్మరణను తగ్గించి ముందు పార్టీ గురించి ప్రచారం చేసుకుంటే మేలు అని వైసీపీ నేతలు తమ్ముళ్ళకు వారి సూచిస్తున్నారు.