నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం బాధితురాలు ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు బీఆర్ఎస్ నేత రవి బాలికను ఓ షెడ్డులోకి లాక్కెళ్లి కాళ్ళు, చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
నిందితుడు బోధన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణకు సోదరుడు. ఆయన ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని బాధితురాలిని బెదిరించినట్లు పోలీసులకు తెలిసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునితోపాటు అతని సోదరుడు రాధాకృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ప్రజా ప్రతినిధి అయి తప్పు చేసిన తమ్ముడిని దండించాల్సింది పోయి.. ఇంకా నిందితుడికే వత్తాసు పలికారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే షకీల్కు తెలియడంతో నిందితుడితో పాటు అతనికి సహకరించిన తన అన్న ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడిని చట్టం ప్రకారం ఉరితీయాలని ప్రభుత్వాన్ని కోరారు.