ఎన్నికలంటే కేవలం ప్రజాదరణ పొందడం ఒక్కటే కాదు. పోల్ మేనేజ్మెంట్ అత్యంత ప్రాధాన్యమైంది. తమ ప్రత్యర్థులను బోల్తా కొట్టించి ఎన్నికల్లో విజయం సాధించేందుకు పోటీదారులు ఎన్నెన్నో వ్యూహాలు రచిస్తుంటారు. ఉదాహరణకు ఒకే ఇంటి పేరుతో పాటు అభ్యర్థి పేరున్న వేర్వేరు వ్యక్తులను వెతికి పట్టుకొచ్చి నామినేషన్ వేయిస్తుంటారు.
అలాగే ప్రధాన రాజకీయ పార్టీల గుర్తులను పోలి ఉండేలా స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కోసారి గుర్తులను ఎన్నికల సంఘం కేటాయిస్తూ వుంటుంది. దీంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయి తాము అనుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థి గుర్తుకు ఓట్లు వేస్తుంటారు. ఇలా గెలుపోటములు తారుమారు అయిన ఘటనలు కోకొల్లలు.
ఈ నేపథ్యంలో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ అప్రమత్తమైంది. తమ గుర్తు (కారు)ను పోలిన రోడ్డు రోలర్, చపాతి మేకర్ తదితర గుర్తుల్ని ఇతరులకు కేటాయించొద్దని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్కు చుక్కెదురైంది. పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం కీలక కామెంట్స్ చేసింది. మన దేశ ఓటర్లు రోడ్డు రోలర్, చపాతి మేకర్, కారు గుర్తులకు తేడా తెలియనంత అమాయకులు కాదని వ్యాఖ్యానించింది.
బీఆర్ఎస్ పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టి వేసింది. రోడ్డు రోలర్, చపాతి మేకర్ గుర్తులతో తాము ఎన్నికల్లో నష్టపోయామని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తెలంగాణ అధికార పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. న్యాయస్థానంలో కూడా బీఆర్ఎస్కు చుక్కెదురు కావడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్ గుర్తులపై ప్రత్యేకంగా చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది.