తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని శేజల్ అనే యువత డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై తీవ్ర లైంగిక ఆరోపణలు వస్తున్నా, సీఎం కేసీఆర్ మాత్రం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఈ నేపథ్యంలో బాధితురాలు శేజల్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. తాజాగా ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా బాధితురాలు శేజల్ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా నిరసనకు దిగడం అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నం దుర్గయ్యపై చర్యకు డిమాండ్ చేస్తూ శేజల్ చేపట్టిన న్యాయ పోరాటం వంద రోజులకు చేరింది.
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట గురువారం ఆమె నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ యువతి మాట్లాడుతూ మరోసారి ఎమ్మెల్యేలపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో తనకు న్యాయం జరగకపోవడంతో ఢిల్లీకి వచ్చి గత 25 రోజులుగా నిరసన తెలియజేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పక్కలోకి వెళ్లకపోతే వ్యాపారం కూడా ఎమ్మెల్యే చేసుకోనివ్వరని చిన్నయ్యపై సంచలన ఆరోపణ చేశారు. చిన్నయ్య తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె వాపోయారు.
ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతానని గతంలో కేసీఆర్ అన్నారని, మరి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆమె నిలదీశారు. వంద రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదా అని శేజల్ నిలదీశారు. కనీసం ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా తప్పుడు కేసులతో వేధించి రిమాండ్కి పంపి తన జీవితం సర్వనాశనం చేశారని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం ఇప్పటికైనా చిన్నయ్యపై సస్పెండ్ వేటు వేయడంతో పాటు కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఇదే ఆఫీస్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్దమని ఆమె వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.