ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభల్లో చెబుతున్న ఒకే ఒక్క డైలాగ్ ప్రతిపక్షాల్ని ఆత్మరక్షణలో పడేసింది. ప్రతిపక్ష నేతల భయాన్ని వారి మాటలే ప్రతిబింబిస్తున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు,. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తాజాగా జనసేనాని పవన్కల్యాణ్ ….జగన్ డైలాగ్పైనే మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతిపక్షాల్ని భయపెట్టే జగన్ చెప్పే మాట ఏంటంటే…పేదల కోసం తాను సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, పెత్తందారుల పక్షాన నిలిచిన ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా, వీరికి తోడు బీజేపీ తయారైందని ఆయన విమర్శిస్తున్నారు.
తనను అందరూ టార్గెట్ చేస్తున్నారని, ఒంటరి వాడినయ్యానని, అయినా భయం లేదని, పైన దేవుడు, మీరే తన బలమని ఆయన ధీమాగా చెబుతున్నారు. దీంతో అయ్యో పాపం జగన్, అందరూ కలిసి ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారనే సానుభూతి ప్రజల్లో ఏర్పడుతోందనే ఆందోళన ప్రతిపక్షాల నేతల్లో కనిపిస్తోంది. పవన్కల్యాణ్ తాజా ప్రసంగంలో ఆ విషయం స్పష్టమైంది.
‘వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని దారులూ సీఎం జగన్ ఇంటివైపే చూపిస్తుంటే ఎవరు పసివాడు?నిన్ను పాపం పసివాడు అనాలా? ఎంత గొప్పవాళ్లనైనా ఎదురుగా కూర్చోబెట్టుకుని చేతులు కట్టుకునేలా చేసి పైశాచిక ఆనందం పొందున్న జగన్ పాపం పసివాడంట. పసిబాలుడిలా అమాయకంగా నవ్వు నటిస్తున్నాడు. తాను ఒంటరి వాడినంటున్న జగన్ పాపం పసిపిల్లవాడు’ అని ధ్వజమెత్తారు.
జగన్ అమాయక నవ్వు పవన్ను చాలా హర్ట్ చేసినట్టు కనిపిస్తోంది. మళ్లీ జగన్ అమాయకత్వాన్ని చూసి జనం మోసపోయి అధికారంలోకి తీసుకొస్తారనే భయం పవన్తో పాటు చంద్రబాబు, సోము వీర్రాజు, అచ్చెన్నాయుడు, లోకేశ్ తదితర నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే జగన్ నవ్వు, తమపై చేసి ఎదురు దాడిని తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాల నేతలంతా ఒకే రకంగా విమర్శలు గుప్పిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే జగన్ స్వభావరీత్యా నవ్వుతూ కనిపిస్తుంటారు. ఆప్యాయంగా అక్కున చేర్చుకోవడం జగన్ తర్వాతే ఎవరైనా. ప్రతిపక్ష పార్టీల నేతల్లో ఏ ఒక్కరూ జగన్కు దీటుగా జనాన్ని ఆకర్షించే స్థాయిలో రాజకీయాలు చేయడం లేదు. తన అభిమానులే జగన్కు ఓట్లు వేశారని పవన్ నెత్తీనోరూ కొట్టుకుని చెబుతుంటే… ఇక ఎవరైనా చేసేదేముంది?