గొప్ప‌లు చెప్ప‌డం కాదు…చికిత్స అందించండి

బీజేపీతో పాటు ప్ర‌ధాని మోదీపై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ విమ‌ర్శ‌లు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. బీజేపీతో సైద్ధాంతికంగా ప్ర‌కాశ్‌రాజ్ తీవ్రంగా విభేదించే విష‌యం తెలిసిందే. బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌తో ప్ర‌కాశ్‌రాజ్ స‌న్నిహితంగా…

బీజేపీతో పాటు ప్ర‌ధాని మోదీపై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ విమ‌ర్శ‌లు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. బీజేపీతో సైద్ధాంతికంగా ప్ర‌కాశ్‌రాజ్ తీవ్రంగా విభేదించే విష‌యం తెలిసిందే. బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌తో ప్ర‌కాశ్‌రాజ్ స‌న్నిహితంగా ఉంటారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం వెళ్లిన‌ప్పుడు, వారికి ముంబ‌య్ విమానాశ్ర‌యంలో ప్ర‌కాశ్ ప్ర‌త్యేకంగా ఆహ్వానం ప‌లికి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యప‌రిచారు.

తాజాగా మోదీని దెప్పి పొడుస్తూ, ఆయ‌న్ను పొగిడిన వాళ్ల‌ను కూడా త‌లంట‌డం విశేషం. ప్ర‌కాశ్‌రాజ్ ట్వీట్ల‌లో పంచ్‌ల‌కు త‌క్కువేం ఉంటుంది? ప్రధాని మోదీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పని చేస్తుంటారని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యానించారు. 

ఇంత‌కూ మోదీని, ఆయ‌న్ను పొగిడిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర‌కాంత్ పాటిల్‌పై ఎలాంటి వ్యంగ్యాస్త్రాలు విసిరారో తెలుసుకుందాం.

‘దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. నిద్రపోలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి’ అంటూ ప్ర‌కాశ్‌రాజ్ ట్వీట్ చేశారు. 

ఒక్క ట్వీట్‌తో ఇటు మోదీని, అటు మ‌హారాష్ట్ర బీజేపీ ఛీప్‌ని త‌ప్పు ప‌ట్టిన‌ట్టైంది. ఈ ట్వీట్ వైర‌ల్ కావ‌డం విశేషం.