టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు. సర్పంచ్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్న బాబు రాజేంద్రప్రసాద్ టీడీపీలో చురుకైన నాయకుడు.
ఇటీవల టీడీపీలో కొత్త నాయకులు రావడంతో ఆయన నెమ్మదించారు. ఒకప్పుడు టీడీపీ తరపున టీవీ డిబేట్లలో విస్తృతంగా పాల్గొనేవారు. ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం, ఇదే సందర్భంలో తిట్టించుకోవడం జరిగిపోయేవి.
ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి కావడంతో రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గుండెపోటుకు గురి కావడం టీడీపీ శ్రేణుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కాస్త ఊపిరిపీల్చుకున్నాయి.
ప్రస్తుతం ఆయనకు వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. యాంజియోగ్రామ్ చేసిన అనంతరం ఆయన ఆరోగ్యానికి సంబంధించి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. బాబు రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆస్పత్రి వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.