ఇటీవల కాలంలో వెండితెరపై కంటే రాజకీయ తెరపై కమెడియన్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తనదైన ప్రత్యేక యాస, హావభావాలతో అందర్నీ ఆకట్టుకుంటున్న పొలిటీషియన్ ఆనం వెంకటరమణారెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ దృష్టిలో పడి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆనం వెంకటరమణారెడ్డి విచక్షణ మరిచి నోరు పారేసుకుంటున్నారు. ఈయనకు మంత్రి అంబటి రాంబాబు ముద్దుగా వడివేలు అని ఓ కమెడియన్ పేరు పెట్టారు.
ఈయనపై నెల్లూరులో ఆదివారం దాడికి యత్నించారు. రాజకీయాల్లో భౌతికదాడుల్ని ఎవరూ సమర్థించరు. భౌతికదాడులే కాదు, ఎదుటి వారిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం కూడా సమర్థనీయం కాదు. నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుందని అంటారు. వడివేలు అలియాస్ ఆనం వెంకటరమణారెడ్డి నోరు మంచిది కాదని టీడీపీ నేతలే చెబుతుంటారు. సమస్యల్ని కోరి తెచ్చుకోవడం వడివేలుకు అలవాటైంది.
తనపై దాడిని ఖండించే క్రమంలో వడివేలు మరోసారి కామెడీ చేయడం విశేషం. సీఎం జగన్కు ఆనం వెంకటరమణారెడ్డి సవాల్ విసరడం హాస్యం కాకుండా మరేమవుతుంది? జగన్కు సవాల్ విసిరే స్థాయా? ఆయన ఏమన్నారంటే…‘దాడులు చేయించడం కాదు జగన్… రా… నువ్వూ, నేనూ తేల్చుకుందాం. ప్లేస్.. టైం మీరే చెప్పండి.. మీరు మగాళ్లు కాదా, మగతనం లేదా? టీడీపీ అధికారంలోకి వస్తే మీ ఇళ్లల్లో దూరాలా? మీ కార్యాలయాలపై దాడులు చేయాలా? అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం మీకు, మాకు మంచిది కాదు. ఆ సంస్కృతి మాది కాదు.. మా అధినేత చంద్రబాబు అలాంటివి ప్రోత్సహించరు’ అని తనదైన శైలిలో ఆయన చెప్పుకొచ్చారు.
అసలు నెల్లూరులో వడివేలనే పొలిటీషియన్ ఉన్నాడని సీఎం జగన్కు తెలుసో లేదో! సీఎంను తిడితే తప్ప టీడీపీలో తనకు రోజు గడవదని ఆయనకు బాగా తెలుసు. ఎవరో ఏదో చేస్తే, దానికి జగన్కు ముడిపెట్టి సవాల్ విసరడం ఆనం వెంకటరమణారెడ్డికే చెల్లు. టీడీపీలో వుంటూ ఈ డ్రామాలెందుకు? హాయిగా వెళ్లి సినిమాల్లో ట్రై చేసుకుంటే, ఏదో ఒకరోజు గుర్తింపు, గౌరవం దక్కుతాయి కదా అని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.