తేజ ముందే చెప్పాడు, అర్థం చేసుకోవాల్సింది!

గత శుక్రవారం రిలీజైన సినిమాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా తేజ తీసిన అహింస సినిమాపై సరదా సరదా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. వీటిలో కాస్త లాజిక్ తో కూడిన కామెంట్…

గత శుక్రవారం రిలీజైన సినిమాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా తేజ తీసిన అహింస సినిమాపై సరదా సరదా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. వీటిలో కాస్త లాజిక్ తో కూడిన కామెంట్ ఒకే ఒక్కటి ఉంది. అదేంటంటే.. అహింస సినిమా ఫ్లాప్ అవుతుందని, దర్శకుడు తేజ ముందే చెప్పాడట. ప్రేక్షకులే సరిగ్గా అర్థం చేసుకోలేక డబ్బులు పెట్టి సినిమాకు వెళ్లారంట.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. అన్ని సినిమాల్లానే అహింస సినిమాకు కూడా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. ఆ ఫంక్షన్ లోనే సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని తేజ చెప్పాడనేది సారాంశం. ఆ ఈవెంట్ లో తేజ ఏమన్నాడంటే..

“కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత సురేష్ బాబుకు రషెష్ చూపించాం. అవి చూసిన సురేష్ బాబు, అసలు ఎందుకు ఈ సినిమా చేశారు, సరిగ్గా చేయలేదు, ఆపేసి ఉండాల్సింది అన్నారు.” అహింస ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో తేజ చెప్పిన మాటలివి. సినిమా సురేష్ బాబుకు నచ్చలేదనే విషయాన్ని తేజ అప్పుడే చెప్పాడు. ఆ విషయాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోయారంటూ పోస్టులు పడుతున్నాయి.

సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా, ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ లో సాగింది. ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. అలా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన అహింస, ఫ్లాప్ అయింది. ఈ విషయాన్ని ప్రేక్షకులు ఇప్పుడు తెలుసుకున్నారని,  మేకర్స్ కు మాత్రం ముందే తెలుసని, ఆ విషయాన్నే తేజ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లోనే చెప్పాడనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది.