ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబునాయుడు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ దఫా ఎలాంటి మొహమాటానికి వెళ్లదలుచుకోలేదని రెండు రోజుల క్రితం ఆయన తేల్చి చెప్పారు. వివిధ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నానని, వాటి నివేదికల్లో వచ్చే సమాచారాన్ని బట్టి అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటానని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఒకే ఒక్క యువ నాయకుడి విషయంలో లోకేశ్ తండ్రి మాటను సైతం లెక్క చేయరనే టాక్ వినిపిస్తోంది.
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్కుమార్రెడ్డి విషయంలో లోకేశ్ గట్టిగా నిలబడ్డారు. పార్టీ కోసం కేసులు, జైళ్లను సైతం లెక్క చేయకుండా నిలబడ్డాడని, అలాంటి యువతను కాపాడుకోవాల్సిన అవసరం వుందనేది లోకేశ్ వాదన. ఒకవేళ అలాంటి యువ నాయకులు ఓడిపోయినా పర్వాలేదని, ఇప్పుడు కాకపోతే మరొకసారైనా గెలుస్తారని బాబుకు నచ్చ చెబుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
అందుకే ప్రొద్దుటూరులో రెండు రోజుల క్రితం నిర్వహించిన బహిరంగ సభలో రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి యువ నాయకుడు పోటీ చేస్తారని, ఆదరించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దీంతో ఉక్కు ప్రవీణ్కు టికెట్ ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ప్రవీణ్పై కేసులు బనాయించి, కడప సెంట్రల్ జైలుకు పంపిన సంగతి తెలిసిందే. అప్పట్లో జైల్లో ఉన్న ప్రవీణ్ను పరామర్శించడానికి లోకేశ్ వెళ్లారు. అనంతరం రానున్న ఎన్నికల్లో ప్రవీణ్ ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు.
చంద్రబాబుతో సంప్రదించకుండానే లోకేశ్ టికెట్ ఖరారు చేయడంపై ప్రొద్దుటూరు టీడీపీ నేతలు లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి గుర్రుగా ఉన్నారు. తండ్రినే లెక్క చేయని లోకేశ్, ఇక స్థానిక నేతల అసంతృప్తుల్ని పరిగణలోకి తీసుకుంటారనుకోవడం అవివేకమే. ప్రవీణ్కు టికెట్ ఇస్తే… కనీసం ఏజెంట్లను కూడా నిలబెట్టుకోలేరని టీడీపీ నేతలు చెబుతున్న మాటల్ని యువనేత పట్టించుకోవడం లేదు. లోకేశ్ ఎవరినైనా అభిమానిస్తే… అట్లుంటది మరి!