ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీతో జత కట్టడం చంద్రబాబుకే చెల్లింది. ఊసరవెల్లితో బాబును పోల్చితే, బహుశా ఆ జీవి అవమానిస్తారా? అని ఆగ్రహిస్తుందేమో! చంద్రబాబులా రాజకీయ రంగులు మార్చడంలో ఆయనకు మరెవరూ సాటిరారు. అయితే నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను చూస్తున్నా, కాస్త గ్యాప్తో మళ్లీ ఆయనతో అంటకాగుతుండడం రాజకీయ పార్టీల దివాళుకోరుతనాన్ని బయట పెట్టుకున్నట్టు అవుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో డిసెంబర్లో అసెంబ్లీ, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర పెద్దలతో బాబు భేటీ అయ్యారనే చర్చ నడుస్తోంది. గతంలో తెలంగాణ అసెంబ్లీ, అలాగే సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీతో విభేదించి, కాంగ్రెస్తో బాబు జత కట్టారు.
మోదీ, అమిత్షాలపై బాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీని గద్దె దించితే తప్ప ఈ దేశానికి మోక్షం లేదని విమర్శించారు. రాహుల్గాంధీతో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని, అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ ప్రాంత కష్టనష్టాలకు కారకుడైన, రాష్ట్ర విభజనను అడ్డుకున్న చంద్రబాబును చూడగానే తెలంగాణ ప్రజలకు కోపం వచ్చింది. మరోవైపు తెలంగాణలో మళ్లీ చంద్రబాబు పాలన కావాలా? అంటూ కేసీఆర్ బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. బాబుతో పొత్తు పెట్టుకున్న పాపానికి కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో మునిగిపోయింది.
ఈ దఫా కాంగ్రెస్కు బదులు బీజేపీతో అంటకాగేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే బాబుకు ఎటూ తెలంగాణలో ఏదీ లేదు. బాబుతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకే నష్టం. బీజేపీతో బాబు పొత్తు పెట్టుకుంటే, మరోసారి కేసీఆర్కు బ్రహ్మాస్త్రాన్ని జాతీయ పార్టీ చేజేతులా ఇచ్చినట్టే. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని బాబుతో స్నేహం అంటే తెలంగాణ బీజేపీ వణికిపోతోందని సమాచారం. ఏపీలో మిత్రపక్షమైన జనసేనతో తెలంగాణ బీజేపీ కలిసి ప్రయాణించడానికి సిద్ధంగా లేని విషయాన్ని ఆ రాష్ట్ర నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నట్టు సమాచారం.
తెలంగాణలో టీడీపీకి అంత సీన్ లేదని, ఎక్కువ ఊహించుకుని నష్టపోవద్దని జాతీయ పార్టీ దృష్టికి కిషన్రెడ్డి తదితరులు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రయోజనాల కోసం, తెలంగాణలో బీజేపీని బలిపెట్టొద్దని తేల్చి చెప్పాలని ఆ రాష్ట్ర నేతలు ఒక అవగాహనతో ఉన్నారు.