ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో అసమ్మతి గళాలు ఆ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఎక్కడైనా అధికార పార్టీలో ఎన్నికల సమయంలో నిరసన గళాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అదేంటో గానీ, ఏపీ విషయానికి వస్తే ఇటీవల కాలంలో టీడీపీలో రోజుకొకరు అసమ్మతి రాగాన్ని ఆలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరిన్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ అసంతృప్త నేతల బహిరంగ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యినట్టు సమాచారం. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ విధానాలను తప్పు పడుతూ మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ విధానాలపై ఏవైనా అభిప్రాయాలు చెప్పాలని అనుకుంటే అధిష్టానంతో నేరుగా మాట్లాడాలని సూచించారు. అంతే తప్ప, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే ఏ స్థాయి నేతలైనా కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించినట్టు చెబుతున్నారు. చంద్రబాబు మేకపోతు గాంభీర్యంపై టీడీపీ నేతలు సెటైర్స్ విసురుతున్నారు. తమ నాయకుడు ఎంతసేపూ హెచ్చరికలకే పరిమితం అవుతారని, చర్యలు తీసుకునేది లేనే లేదని వారు అంటున్నారు.
కనీసం ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే, మూడో వ్యక్తి పార్టీ నిర్ణయాలపై బహిరంగంగా వ్యతిరేకత ప్రదర్శించడానికి వెనుకాడతారని చెబుతున్నారు. కానీ చంద్రబాబు ఆ పని చేయరని, ఒకవేళ కఠిన చర్యలు తీసుకుంటే ఏమవుతుందోనని భయపడుతుంటారని, అదే నాయకులకు అలుసుగా మారిందని అభిప్రాయపడుతున్నారు.