తెలంగాణలో లోక్సభ గత ఎన్నికల్లోనూ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ పుంజుకున్నట్టు -ఆంధ్ర లో కూడా పుంజుకుంటుందా? క్షేత్ర స్థాయి పరిస్థితులను ఒకసారి పరిశీలించి చూస్తే- అలాంటి 'వెసులుబాట్లు' ఆంధ్ర బీజేపీకి ఉన్నట్టు కనిపించవు. తెలంగాణలో ఉన్న ' అనుకూల' పరిస్థితులు – ఆంధ్రలో బీజేపీకి లేవు.
తెలంగాణలో- అటు హైదరాబాద్లోనూ, ఇటు పలు జిల్లాల్లోనూ ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. వారికీ, హిందూ జనాభాకు సఖ్యత అంతంత మాత్రం అనే భావన తెలంగాణలో అంతర్లీనంగా ఉందంటారు.
తెలంగాణ ముస్లింలలో ఎంఐఎం పార్టీ ప్రభావం చాలా అధికం. అఫ్జల్ గంజ్ బ్రిడ్జికి అవతల ఉండే ఓల్డ్ సిటీకి- ఇవతల ఉండే సిటీకి చాలా తేడా ఉంది. ఈ కారణాల వల్ల, హిందువులలో బీజేపీకి చెప్పుకోతగిన ఆదరణ ఉంది. హైదరాబాద్లోనూ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ బీజేపీ బలం- ముస్లింలలో ఉంది.
పైపెచ్చు- బీజేపీకి తెలంగాణలో బలమైన నాయకులు ఉన్నారు. 'టైగర్' ఆలె నరేంద్ర , వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, బద్దం బాల్రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సిహెచ్ విద్యాసాగర్ రావు, లక్ష్మణ్, ప్రభాకర్, రాజా సింగ్…. ఇంకా అనేక మంది- గేలక్సీ ఆఫ్ స్టార్స్- తెలంగాణ బీజేపీని సుసంపన్నం చేశారు. వారంతా వేసిన బలమైన పునాది మీద నిలబడి…కత్తి తిప్పే బండి సంజయ్ నాయకత్వం తెలంగాణ బీజేపీకి లభించింది. ఆయన స్వయంగా ఎంపీగా గెలిచి ఉన్నారు.
ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై కలిగే అసంతృప్తిని కాంగ్రెస్ 'క్యాష్' చేసుకోలేక పోతున్నదనే భావం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఫలితంగా – బీజేపీ కాలూనడానికి కాస్తంత జాగా దొరికింది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా- 'ప్రస్తుతానికి' బీజేపీ వైపు మళ్లింది. ఫలితంగా బీజేపీ విజయాలు కంటికింపుగా కనిపిస్తున్నాయి.
ఆంధ్ర విషయానికి వస్తే- ఆంధ్రలో ముస్లింల నుంచి ముస్లిమేతరులు ఎవరూ అభద్రతా భావానికి లోను కావడం లేదు. ఆంధ్రలో ముస్లింలు- ముస్లిమేతరులు కూడా- అక్కా,బావా పిన్నీ-బాబాయ్ అత్తయ్యా- మామయ్య వరుసలతో కలిసి, మెలసి ఉంటారు. అందువల్ల- అక్కడ చలి కాచుకోవడం బీజేపీకి కుదరదు.
గతంలో బీజేపీ అంటే- తెనాలిలో జూపూడి యజ్ఞనారాయణ – అటు విశాఖ వైపు వెడితే- చలపతిరావు, మేయర్గా పని చేసిన అడ్వకేట్ సుబ్బారావు (జనసంఘ్ రోజులలో). ఆ తరం గతించిన తరువాత- వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.
కారణాలు ఏమైతేనేం- నాయకత్వ శూన్యత అనేది ఆంధ్ర బీజేపీలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం. ఆంధ్ర బీజేపీలో ముఖ్య నాయకుల పేర్లు మూడు, నాలుగు చెప్పమంటే- తడుముకోవాల్సిందే. తెలంగాణ నాయకత్వ శ్రేణితో పోల్చుకుంటే- ఆంధ్ర బీజేపీ కి ఇది రెండో మైనస్.
ఇక హిందూత్వ భావజాలాన్ని గిలకొట్టి లబ్ధి పొందవచ్చుననుకున్నప్పటికీ- ఆంధ్రలో బీజేపీ కి వర్క్ ఔట్ అయ్యే వాతావరణం కనపడడం లేదు. ఎందుకంటే- తెలుగుదేశం ఈ కోణంలో రెడీ అయిపోతున్నది. వైసిపి ని రాజకీయంగా ఎదుర్కొనడానికి సతమతమై పోతున్న తెలుగు దేశం పార్టీ తనకు అనుకోకుండా ఓ ఆయుధం దొరికినట్టు భావిస్తోంది. తన ఎజెండాను టీడీపీ నెత్తికెత్తుకోవడం బీజేపీకి బీపీ పెంచుతోంది.
ఎవరో ఆకతాయిలు- పైశాచికానందం పొందేందుకు దేవతా మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే- వీటిని వైసీపీకి అంటగట్టేయడం ద్వారా , హిందూత్వ భావనలను భుజానికి తగిలించుకొనే సరికొత్త రాజకీయానికి తెలుగు దేశం పార్టీ శ్రీకారం చుట్టింది. దీనితో- ఆంధ్ర బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీ కే ఎక్కువ మైలేజ్ లభిస్తోంది.
రామ తీర్ధం సందర్శనకు చంద్రబాబు వెళ్ళినపుడు వ్యక్తమైన జన స్పందన ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏ దేవతా విగ్రహానికి ఏ రకమైన ఇబ్బంది కలిగినా- తెలుగు దేశం పార్టీ అక్కడ ముందుగా ప్రత్యక్షమవుతుందనడంలో సందేహం లేదు.
ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించినంత వరకు- హిందూత్వ భావజాలాన్ని తానే ప్రతినిధిని తప్ప బీజేపీ కాదని- తెలుగు దేశం పార్టీ ఘనంగా ప్రకటించడానికి సమాయత్తమవుతున్నది. దానికి 40 శాతం నిలకడైన ఓట్ బ్యాంక్ ఉన్నదనే విషయం గుర్తుంచుకోవాలి. హిందూత్వ భావజాలాన్ని ఈ ఓట్ బ్యాంక్ కు జత చేయడానికి చంద్రబాబు నాయుడు సమాయత్తమవుతున్నారు. బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్- ఒక్క శాతమే.
ఈ కారణాలు అటు ఉంచితే- పవన్ కళ్యాణ్…సోము వీర్రాజు- చెరో పక్కకూ లాగుతున్నారనే భావం రాజకీయాల్లో బలంగా వ్యక్తమవుతోంది. జగన్ను, వైసీపీని విమర్శించడం పవన్ కళ్యాణ్కు ఇష్టం. చంద్రబాబును, తెలుగుదేశాన్ని విమర్శించడం సోము వీర్రాజు కు ఇష్టం. దీంతో బీజేపీకి ఒక స్పష్టమైన వైఖరి లేకుండా పోయే ప్రమాదం ఉంది.
తమకు వైసీపీ రాజకీయ శత్రువా…లేక- తెలుగు దేశమా అనేది ఈ నాయకులు నిర్ణయించుకోకుండా- ఎన్నికలకు వెడితే- ఖాతా తెరవడం కూడా కష్టం కావచ్చు. తెలంగాణ బీజేపీకి – వెనుక నుంచి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మద్దతు ఇవ్వడం వల్ల-4 ఎం.పి స్థానాలు 48 మునిసిపల్ కార్పొరేటర్ స్థానాలు లభించాయనేది బహిరంగ రహస్యం.
ఆంధ్ర బీజేపీకి ఆ వెసులుబాటు బాటు కూడా లేదు. బీజేపీ స్వంతం గా పోటీ చేయాలి అనుకుంటే- కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వరు. వైసీపీ ఇవ్వదు. టీడీపీ కూడా ఇవ్వదు. వైసీపీ, టీడీపీలలో- దేనితోనో ఒకదానితో పొత్తు పెట్టుకోకుండా- స్వంతం గా సీట్లు సంపాదించే పరిస్థితి బీజేపీ- జనసేన కూటమికి లేదు.
అయితే- రాజకీయ కాలక్షేపానికి మాత్రం లోటు ఉండదని చెప్పవచ్చు. ఆంధ్రలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నిక లో బీజేపీ తరఫున- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయిన బండి సంజయ్ ఘీంకరించడమే- ఆంధ్ర బీజేపీ 'నిస్సహాయ' స్థితికి అద్దం పడుతోంది.
-భోగాది వేంకట రాయుడు