జ‌గ‌న్‌కు పోల’వరం’- త్వ‌ర‌లో రూ.17 వేల కోట్లు!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఇటీవ‌ల కాలంలో అన్నీ సానుకూల ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంలో రావాల్సిన లోటు బ‌డ్జెట్ కింద ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం రూ.10 వేల కోట్ల‌కు పైగా నిధుల్ని…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఇటీవ‌ల కాలంలో అన్నీ సానుకూల ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంలో రావాల్సిన లోటు బ‌డ్జెట్ కింద ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం రూ.10 వేల కోట్ల‌కు పైగా నిధుల్ని కేంద్రం అంద‌జేసింది. గ‌తంలో చంద్ర‌బాబునాయుడుకు సాధ్యం కానిది, జ‌గ‌న్ సాధించిన‌ట్టైంది. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్రం నుంచి మ‌రో తీపి క‌బురు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి 17,414 కోట్ల రూపాయలు అడ్‌హ‌క్ (ADHOK) నిధులు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ మధ్యే కేంద్రం 10 వేల కోట్ల రూపాయలు ఆర్థికలోటు బకాయిలు విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా వాస్త‌విక దృక్పథంతో కాకుండా రాజకీయ కోణంలో చర్చ జరుగుతోంది. పోలవరం తాకట్టు పెట్టి 10 వేల కోట్లు తీసుకొచ్చారని విమర్శలు చేశారు. ఇప్పుడు పోలవరానికి అడ్‌హ‌క్ కింద 17,414 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయడంతో పోలవరం ఎత్తు మట్టం కుదింపు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు పక్కన పెట్టి వాస్తవాలను పరిశీలిద్దాం..

పోలవరం ప్రాధాన్యం

ఆంద్రప్రదేశ్ నీటి అవసరాలను తీర్చేది ప్రధానంగా గోదావరి , కృష్ణా నదులు. కృష్ణ నీటిని మిగులు జలాలతో సహా పంపిణీ చేసిన నేపథ్యంలో అపారమైన నీటి లభ్యతకు అవకాశం ఉన్న గోదావరిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణా డెల్టా , గోదావరి, విశాఖ నగర, పారిశ్రామిక అవసరాలకు గోదావరి నీరే ప్రధానం. అలా పోలవరం కీలక ప్రాజెక్టు అనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్ , గోదావరి, విశాఖనగర, పారిశ్రామిక అవసరాలకుగాను దాదాపు 360 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

పోలవరం నీటి నిల్వ ప్రాజెక్టు కాదు

ప్రస్తుత డిజైన్ 150 అడుగుల్లో 196 టీఎంసీల నీటి నిల్వ‌. కుడికాలవ (పట్టిసీమ) కృష్ణా డెల్టా, ఎడమకాలువ (పురుషోత్తపట్నం) గోదావరి, విశాఖ అవసరాలు. ఈ కాల్వల ద్వారా 360 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇక్కడే కీలక విషయాన్ని పరిశీలన చేయాలి. 196 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేసి అందులో డెడ్ స్టోరేజ్ పోను అవకాశం ఉన్నది దాదాపు 150 టీఎంసీలే. మరి 360 టీఎంసీల నీరు ఎలా తీసుకుంటారు? పోలవరం అనేది నాగార్జున సాగర్, శ్రీశైలం లాగా నిల్వ ఉంచిన నీటిని సరఫరా చేసే ప్రాజెక్టు కాదు. గోదావరి 120 రోజులు ప్రవాహం ఉంటుంది. కనుక గ్రావిటీతోనే కుడి, ఎడమ కాల్వలకు నీరు డ్రాచేసుకునే అవకాశం ఉండే విధంగా ఎత్తుమట్టం ఉంటే సరిపోతుంది.

పోలవరం, గోదావరినదిపై కోస్లా నిపుణుల కమిటీ, CWC ల పరిశీలన

గోదావరి నదిని కేంద్రప్రభుత్వ పరిధిలోని CWC 29 సంవత్సరాలు పరిశీలించిన పిదప ఒక నివేదికను విడుదల చేసింది. అనేక అంశాలు ఉన్నప్పటికీ పోలవరంతో ముడిపడి ఉన్న అంశాలు వరకే చర్చకు పెడుతున్నాను. గోదావరి నది పెద్ద స్థాయిలో నీటిని తీసుకొస్తుంది. ముఖ్యంగా పోలవరం సమీపంలో 51 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుతో నది ఉధృతంగా ప్రహిస్తుంది. ఈ మధ్య వచ్చిన వరదలలో కూడా దాదాపు 70 టీఎంసీల ప్రవాహం కొన్ని రోజుల పాటు ఉంది. ఇంతకు 2 , 3 రెట్లు కూడా చరిత్రలో నమోదైంది. కీలక విషయం ఈ ప్రాంతంలో రోజుల వ్యవధిలో 30 టీఎంసీలు సిపేజి (సాధారణ భాషలో ఆవిరి, నీరు ఇంకడం) ఉంటుంది. జియాలజిస్టులు కూడా సిపేజిని గుర్తించారు కానీ అందుకు గల కారణాలపై మరింత అధ్యయనం చేయాలని చెబుతున్నారు. 

పోలవరం ప్రాజెక్టులో భారీగా నీటిని నిల్వ చేసినా సిపేజి వల్ల‌ పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రవాహం ఉన్నపుడే నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారం. కీలకమైన మరో అంశం రాయలసీమలోని శ్రీశైలం డ్యాం ఉన్న ప్రాంతం రాతితో కూడిన నేల. అదే పోలవరం శాండ్. గోదావరితో పోల్చుకుంటే తక్కువ ప్రవాహం కలిగిన శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో చాలాసార్లు ఆందోళన కలిగింది. అలాంటిది శాండ్ స్వభావం కలిగిన భారీ నీటి ప్రవాహం ఉన్న ప్రాంతంలో ఎక్కువ ఎత్తు మట్టంతో ప్రాజెక్టు నిర్మించి భారీగా నీటిని నిల్వ చేయడం రాజమండ్రితో సహా దిగువ ప్రాంతానికి భద్రత రీత్యా 150 అడుగులు సముచితమా ? అన్న కోణంలో కూడా ప్రభుత్వాలు పరిశీలన చేయాలి.

135 అడుగులతోనే ప్రయోజనం

పోలవరం ప్రధాన ప్రయోజనం 360 టీఎంసీల నీరు డ్రా చేయడమే. కుడికాలవకు 131 అడుగులతో నీటి విడుదల చేయవచ్చు. ఎడమ కాలువకు 132 అడుగులతో విడుదల చేయవచ్చు. గోదావరి 120 రోజుల ప్రవాహం ఉంటుంది. కుడి, ఎడమ కాలువల ప్రస్తుత సామర్ధ్యం రోజుకు 17500 క్యూసెక్కులు. ఉభయ కాల్వల సామర్థ్యం కలిపితే రోజుకు 3 టీఎంసీలు. 120 రోజులు ప్రవాహం ఉంటుంది కాబట్టి 360 టీఎంసీల నీరు తీసుకోవడానికి 135 అడుగులు సరిపోతుంది. భవిష్యత్తులో అదనపు నీరు డ్రా చేయాలనుకుంటే కాల్వల సామర్ధ్యం పెంచుకోవడం కష్టం కాదు. కోస్లా నిపుణుల కమిటీ రెండు కాల్వలకు నీరు విడుదలకు సరిపడ స్థాయిలో మాత్రమే ప్రాజెక్టు ఎత్తుమట్టం ఉండాలని స్పష్టం చేసింది. దాదాపు ఇలాంటి అభిప్రాయాన్ని కేయల్ రావు గారు వ్యక్తం చేశారు. పోలవరం ప్రయోజనాలలో వ్యత్యాసం లేనపుడు. ఎత్తుమట్టం విషయంలో వివాదం ఎందుకు చేయాలి?

అవగాహన లేమి

ఎత్తుమట్టం పై చర్చ జరిగినపుడు చాలామంది అవగాహన లేమితో మాట్లాడేది సైజు. సాధారణంగా చిన్న పాత్ర కన్నా పెద్ద పాత్రలో ఎక్కువ నీటిని ఉంచవచ్చు. కానీ ఇంతకు ముందు ప్రస్తావన చేసినట్లు మిగిలిన జలాశయాల లాగా పోలవరం నీటినిల్వ ప్రాజెక్టు కాదు. 120 రోజుల పాటు ప్రవాహం ఉన్నపుడే నీటిని డ్రా చేసుకునే ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది. ఇదే నదిపై కాటన్ బ్యారేజి ఉంది. దాని సామర్థ్యం 1.5 టీఎంసీలు. దాని వలన సాగు చేస్తున్న విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు. ఒక  టీఎంసీ నీరు 10 వేల ఎకరాలకు సరిపోతుంది. 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న కాటన్ బ్యారేజి 10 లక్షల ఎకరాల భూమి ఎలా సాగుబడి అవుతుంది అంటే 120 రోజుల పాటు గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి. అదే సూత్రం పోలవరం ప్రాజెక్టుకు వర్తిస్తుంది.

తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు

నేడు పోలవరం ఎత్తుమట్టంపై జరిగే చర్చలో రాజకీయ కోణం ప్రధానంగా కనిపిస్తుంది. కేసీఆర్, జగన్ మైత్రి వలన తెలంగాణ కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని విమర్శలు. వారి ఇద్దరి రాజకీయ మైత్రిపై నేను వివరణ ఇవ్వడం లేదు. కానీ పోలవరం ఎత్తుమట్టం చుట్టూ తెలంగాణ ప్రయోజనాలు లేవు అని మాత్రం చెప్పగలను.

1. పోలవరం ప్రాజెక్టు ఉన్నది తెలంగాణ రాష్ట్రం తర్వాత అన్న విషయం మరిచిపోకూడదు. పోలవరంలో ఎక్కువ నీరు నిలిపితే సముద్రంలోకి వెళ్లే నీరు తగ్గుతుంది. అదే నిల్వచేయకపోతే సముద్రంలోకి వెళుతుంది.

2. ఒక వేల నిర్వాసితుల సమస్య అనుకుంటే పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన తర్వాత ఆ అంశానికి కూడా ప్రాధాన్యత లేదు.

3. గోదావరి నది ఎక్కువ దూరం ప్రవహిస్తున్న రాష్ట్రం తెలంగాణ. కానీ వారు గ్రావిటీతో నీరు వాడుకోలేని పరిస్థితి. ఒక వేల మొత్తం గోదావరి నీటిని వారి రాష్ట్రంలో నిలుపుకున్నా (అసాధ్యం) పోలవరం ప్రాజెక్టు నీటి లభ్యతకు భయం లేదు. కారణం తెలంగాణతో సంబంధం లేకుండా పుష్కలంగా గోదావరి ఉపనది శబరి నీటిని తీసుకొస్తుంది. అందుకే 7 ముంపు మండలాలను ఏపీలో కలిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సహకరించినా సహకరించకపోయినా పోలవరం ఆగదు. కేంద్రం, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలతో మాత్రమే సాంకేతికంగా సమస్యలు ఉంటాయి.

ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. విధానపరమైన కమిటీల నివేదికలలోని సిఫార్సులను ఒక చోటికి చేర్చడం మాత్రమే నేను చేసింది. నీటి ప్రాజెక్టుల విషయంలో అపారమైన అనుభవం, అధికారులు ఉన్న CWC, కోస్లా నిపుణుల కమిటీల సిఫార్సులు. కేయల్ రావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి గొప్పవారి సూచనలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం పూర్తి చేయాలి. ఎత్తుమట్టం విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కోణంలో కాకుండా వాస్తవిక కోణంలో ఆలోచించి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త రాయలసీమ మేధావుల ఫోరం