అన్నీ అనుభవించి… పందిలా బలిసి…!

రాజకీయ విమర్శలుగానే వీటిని చూడాలి. ఏపీలో ఇలాంటి విమర్శలకు జనాలు అలవాటు పడిపోయారు కాబట్టి ఏ తప్పూ లేదు. వారు అన్నారని వీరు ఇలా అంతా కలసి మాటలకు బదులు తిట్ల దండకాలనే అందుకుంటున్నారు.…

రాజకీయ విమర్శలుగానే వీటిని చూడాలి. ఏపీలో ఇలాంటి విమర్శలకు జనాలు అలవాటు పడిపోయారు కాబట్టి ఏ తప్పూ లేదు. వారు అన్నారని వీరు ఇలా అంతా కలసి మాటలకు బదులు తిట్ల దండకాలనే అందుకుంటున్నారు. టీడీపీ ఉత్తరాంధ్రా ఇంచార్జి బుద్ధా వెంకన్న విశాఖలో మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ తమ్మినేని సీతారాం మీద తిట్లే వర్షంగా కురిపించారు.

తొమ్మిదేళ్ళ పాటు టీడీపీలో మంత్రిగా పనిచేసి చంద్రబాబును ఫినిష్ చేస్తాను అంటావా అసలు సిగ్గుందా నీకు అంటూ బుద్ధా వెంకన్న లంకించుకున్నారు. పందిలా బలిసావు అంటూ తమ్మినేని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆముదాలవలసలో ఈసారి కూన రవికుమార్ మీద గెలవగలవా అని సవాల్ చేస్తున్నానని వెంకన్న అంటున్నారు.

సొంత నియోజకవర్గం ప్రజలు తమ్మినేనిని అసహ్యించుకుంటున్నారని ఆయన ఓటమి ఖాయమని ఇది తన మాట అన్నారు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్రా దాకా ఏ వైసీపీ నేత ఏ టైం లో ఎలాంటి మాటలు అన్నారో అన్నీ టీడీపీ ఆఫీసులో చిత్రగుప్తుడు ఒకరు కూర్చుని తేదీలతో సహా రాస్తున్నారు అని అన్నారు. మేము అధికారంలోకి రాగానే ఇలాంటి నేతల లెక్కలు తేల్చేస్తామని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు లోకేష్ నుంచి అంతా కూడా జనాలకు ఇచ్చే హామీలు ఎన్నికల ప్రణాళికలను పక్కన పెడితే వైసీపీ వారికి ట్రీట్మెంట్ ఇస్తామని మాత్రం చెబుతూ వస్తున్నారు. కక్ష సాధింపు రాజకీయాలు కంటిన్యూ అంటున్నారు. రేపటి రోజున టీడీపీ వచ్చినా ఇదే కధ ఉంటుందని జనాలను ప్రిపేర్ చేస్తున్నారు. తమ్మినేని అన్నది తప్పు అయితే దాని మించి టీడీపీ నేతలు విమర్శలు చేస్తే ఇక తీర్పు చెప్పేది ఎవరు అన్న మాట వినవస్తోంది.