టీడీపీలో కొంత మంది నేతలకు టికెట్ భయం పట్టుకుంది. దీంతో ఎలాగైనా చంద్రబాబు, లోకేశ్ దృష్టిలో పడి టికెట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఇష్టానుసారం నోరు పారేసుకునే నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కాస్త ముందు వరుసలో ఉన్నారు. ప్రతిదానికీ తానున్నానంటూ ఆమె మీడియా ముందుకొస్తున్నారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో అనిత వ్యవహరించిన తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. మర్యాదస్తులు మాట్లాడ్డానికి జంకిన తరుణంలో …ఇలాంటప్పుడు మాట్లాడితేనే తనకు గుర్తింపు వస్తుందని అనిత తహతహలాడడంపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఓ రేంజ్లో ఆడుకున్నారు.
ఒక దఫా పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచిన అనిత, ఆ నియోజకవర్గ ప్రజల్ని, టీడీపీ కార్యకర్తల్ని బాగా భయపెట్టారు. దీంతో 2019లో పాయకరావుపేటలో నిలబెడితే తామే ఓడిస్తామని టీడీపీ కేడర్ హెచ్చరించడంతో చంద్రబాబు భయపడి, ఆమెకు మరోచోట టికెట్ ఇచ్చారు.
ఇప్పుడు మరోసారి పాయకరావుపేటలో టికెట్ కోసం తపస్సు చేస్తున్నారామె. ఆమెకు టికెట్ ఇవ్వడం అంటే టీడీపీ ఒక సీటును పోగొట్టుకోవడమే అని సర్వే నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆమె తన వంతు ప్రయత్నాల్ని మాత్రం మానలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆమె మీడియా ముందుకొచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆ తర్వాత దశలవారీగా మద్యపాన నిషేధం అన్నారని వైసీపీకి గుర్తు చేశారు.
ఇప్పుడు ఎన్నో దశలో వుందో చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మద్యం విషయాన్ని పదేపదే అనిత ప్రస్తావిస్తుండడంతో ఆమెపై వైసీపీ సోషల్ మీడియా సెటైర్లు విసురుతోంది. అనితకు మద్యం వివరాలు కావాలట అంటూ రకరకాల బ్రాండ్లు, వాటి రేట్లు, ఇతరత్రా వివరాలను ఆమె ఫొటో పక్కన పెట్టి మరీ వ్యంగ్య కామెంట్స్ చేయడం గమనార్హం.
వైసీపీ మేనిఫెస్టో ను 98.5 శాతం అమలు చేసామని.. మేనిఫెస్టోని పవిత్ర గ్రంధం అని చెప్పి వైసీపీ నేతలు గ్రంధం చూడడం మానేశారని అనిత ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనని.. దమ్ముంటే అభివృద్ధిపై వైసీపీ నేతలు చర్చకు రావాలని అనిత సవాల్ చేశారు. మద్యం అంశంపై మాట్లాడుతున్న అనితకు ఏదో మత్తు ఆవహించినట్టుందని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు దెప్పి పొడుస్తున్నారు.
గతంలో టీడీపీ వెబ్సైట్ నుంచి మ్యానిఫెస్టోను తొలగించిన సంగతి ఆమె గుర్తించుకుంటే మంచిదని హితవు చెబుతున్నారు.