టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఆత్మ, పరమాత్మల్లా పత్రికాధిపతులు రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. బాబుకు కష్టమొస్తే, అది తమకొచ్చినట్టే అని ఆ రెండు మీడియా సంస్థల అధిపతులు విలవిలలాడుతారని మీడియా సర్కిల్స్లో చెప్పుకుంటారు. ఈ ప్రచారం నిజమేనని నిరూపించే ఉదంతం గురించి చెప్పుకుందాం.
తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో కీలక నిందితుడైన జెరుసలేం మత్తయ్య అప్రూవర్గా మారారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తాజాగా ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆ వాంగ్మూలం ఇప్పుడు తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎందుకంటే టీడీపీ రాజకీయ భవిష్యత్ దిశ, దశను మార్చే ఆ వాంగ్మూలం సహజంగానే ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
అయితే మత్తయ్య వాంగ్మూలానికి సంబంధించి సమాచారాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో క్యారీ చేసిన విధానం చూస్తే… ఆ సంస్థల అధిపతులైన రామోజీరావు, ఆర్కే ఎంతగా విలవిలలాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
అదేదో తాము రాస్తే లేదా చెబితే తప్ప లోకానికి ఏమీ తెలిసే అవకాశం లేదనే భ్రమలో ఇంకా ఆ రెండు మీడియా సంస్థలు ఉన్నాయనే భావన ఎవరికైనా కలుగుతోంది. ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషమంలో సీబీఐ, ఈడీ దర్యాప్తుల గురించి రాసిన తీరు గురించి పలువురు గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు తమ ఆరాధ్య నేతపై మత్తయ్య కీలక వాంగ్మూలం ఇవ్వడంతో ఏం రాయాలో, ఏం చెప్పాలో సదరు ఎల్లో గ్యాంగ్కు అర్థం కావడం లేదు. జనం కళ్లకు గంతలు కట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రయత్నించాయని మత్తయ్య వాంగ్మూలంపై ప్రచురించిన వార్తలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈనాడులో లోపలి పేజీల్లో ఎవరూ గుర్తు పట్టకుండా వార్త ప్రచురించడాన్ని చూడొచ్చు.
“చంద్రబాబు సమక్షంలోనే డీల్” శీర్షికతో ఈనాడులో వార్తను క్యారీ చేశారు. ఎంతో కీలకమైన ఈ అంశాన్ని సాదాసీదాగా ఈనాడులో రాయడం గమనార్హం. “ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే డీల్ జరిగిందని పాస్టర్ జెరుసలేం మత్తయ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు ఆఫర్ ఇస్తామని , డీల్ కుదిరిస్తే తనకు గుడ్విల్గా రూ.50 లక్షలు ఇస్తామని చంద్రబాబు, రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఈడీ ఉపసంచాలకుడు రాహుల్ సింఘానియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు” …. ఈ రకంగా ఈనాడు తన ఆరాధ్య దైవానికి అక్షరాభిషేకం చేసింది.
ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే …”స్టీఫెన్సన్ను ఒప్పించాలని రేవంత్ కోరారు” శీర్షికతో ఈనాడు పద్ధతినే ఫాలో అయి లోపలి పేజీలో వార్తను ప్రచురించారు. ఈనాడు కంటే కొంచెం మెరుగ్గా ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది.
ఆడియో, వీడియో, సెల్ఫోన్ మెసేజ్లను మత్తయ్య ముందు ఉంచి ఈడీ అధికారులు నిర్ధారించుకున్నట్టు ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. ఈడీ విచారణలో మత్తయ్య పలు కీలక అంశాలు వెల్లడించారని, అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలోనే (ఓటుకు రూ.5 కోట్లు ) డబ్బు ఇచ్చేలా అంగీకారం జరిగినట్టు మత్తయ్య అంగీకరించారని రాశారు.
నాయకులను బట్టి కాకుండా, నిజాల ఆధారంగా వార్తలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. ఇలా ప్రత్యేకం గా ఒక వార్త విషయమై చర్చించుకోవాల్సిన అవసరం కూడా రాదు. కానీ జగన్ విషయంలో ఏమీ లేనిదాన్ని కూడా పెద్దగా క్రియేట్ చేసి చూపించడం, చంద్రబాబు దగ్గరికి వచ్చే సరికి నిజాలకు పాతరేసేలా ఆ రెండు మీడియా సంస్థలు వ్యవహరిస్తుండడం వల్లే పాఠకులు, ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
మత్తయ్య అప్రూవర్గా మారడం వల్ల చంద్రబాబు భవిష్యత్పై ఇటు టీడీపీ, అటు ఎల్లో మీడియా ఎంతగా భయపడుతు న్నాయో, అవి మౌనం పాటించడం లేదా ఏమీ లేదన్నట్టు దాచే ప్రయత్నాలే ప్రతిబింబిస్తున్నాయి. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత దేన్నీ దాచలేరని, పైగా తమ పక్షపాత, పచ్చపాత బుద్ధిని తమకు తాముగా బయట పెట్టుకున్నట్టు అవుతుందని ఎల్లో మీడియా అర్థం చేసుకోవాల్సి ఉంది.