బట్ట కాల్చి ముఖం మీద వేస్తున్నారు…బాబాయ్ ఆవేశం

వర్తమాన రాజకీయాల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన చెందారు. మంచిగా ఉంటున్నా కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని తల్లడిల్లారు. బట్ట కాల్చి ముఖం మీద వేస్తున్నారని…

వర్తమాన రాజకీయాల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన చెందారు. మంచిగా ఉంటున్నా కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని తల్లడిల్లారు. బట్ట కాల్చి ముఖం మీద వేస్తున్నారని ఇలాంటి రాజకీయాల్లో అంతా ఉండాల్సి వస్తోందని  అన్నారు.

అందువల్ల వైసీపీ ప్రజా ప్రతినిధులు అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విశాఖకు మేలు చేస్తున్న ఏకైక నాయకుడు జగన్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షెమ కార్యక్రమాలను జగన్ ప్రవేశపెట్టి ఎక్కడా అవి ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు.

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత గెలిచిన వారి మీదనే ఉందని అన్నారు. విశాఖ నగరానికి అనేక అనుకూలతలు ఉన్నాయని అన్నీ సమకూరితే రాజధాని నగరంగా కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

విశాఖ వైభవాన్ని కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఇతర నాయకులు అంతా మరింతగా పెంచాలని వైవీ కోరారు. ఎవరు ఏమిటి అన్నది తన దగ్గర పూర్తి సమాచారం ఉందని, పనితీరు మెరుగుపరచుకోవాలని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించడం విశేషం. రాజకీయాల్లో బట్ట కాల్చి ముఖం మీద వేసే వారు ఉన్నారని వైవీ అనడం వెనక ఉద్దేశ్యం ఏమిటో తెలియాల్సి ఉంది. కష్టపడినా కూడా తమ నాయకుడు జగన్ మీద ప్రభుత్వం మీద విష ప్రచారం ప్రతిపక్షాలు చేస్తున్నాయన్న దాని మీదనే వైవీ మాట్లాడారా లేక ఇంకేమైనా విషయాలు ఉన్నాయా అన్న దాని మీద తర్కించుకుంటున్నారు. 

వైవీ చెప్పిన దాంట్లో నిజముందని ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు ఉన్నవీ లేనివి చిలవలు పలవలుగా ప్రచారం చేస్తున్నారు అని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. పెద్దాయన విశేష రాజకీయం అనుభవం ఉన్న వైవీ ఊరకే కామెంట్స్ చేయరని అంటున్నారు.