మరీ ఇంతగా రెచ్చగొట్టాలా నాగబాబూ!

నాగశ్రీను కుటుంబానికి నాగబాబు సాయం మంచిదే, అనారోగ్యంతో ఉన్న ఆ యువకుడి తల్లికి అపోలోలో వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇవ్వడం, 50వేలు రూపాయలు ఆర్థిక సాయం చేయడం అన్నీ.. నాగబాబు పెద్ద మనసుకి…

నాగశ్రీను కుటుంబానికి నాగబాబు సాయం మంచిదే, అనారోగ్యంతో ఉన్న ఆ యువకుడి తల్లికి అపోలోలో వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇవ్వడం, 50వేలు రూపాయలు ఆర్థిక సాయం చేయడం అన్నీ.. నాగబాబు పెద్ద మనసుకి ఉదాహరణలే. కానీ జీతం సరిగా అందడం లేదు అంటూ ఆ సన్నాయి నొక్కులు నొక్కడమే కాస్త ఇబ్బందిగా మారింది. 

వెంటనే మంచు ఫ్యామిలీ రియాక్ట్ అయింది. నెలనెలా నాగశ్రీనుకి జీతం కరెక్ట్ గా వేస్తున్నామని, గత నెల జీతం కూడా సరిగ్గానే అందిందని వివరణ ఇచ్చారు మంచు ఫ్యామిలీ పీఆర్వో. ఒకరకంగా మరోసారి మంచు మెగా కుటుంబాల మధ్య వార్ మొదలైందనే చెప్పాలి.

మాతో మొదలైన గొడవ నాగశ్రీను వరకు..

మా అధ్యక్ష ఎన్నికల్లో మెగా ప్యామిలీ, మంచు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరిగింది. చివరకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడం, ఆ తర్వాత మా సభ్యత్వానికి కొంతమంది రాజీనామా.. వాటిని అధ్యక్షుడు మంచు విష్ణు తిరస్కరించడం.. ఇలా క్రమక్రమంగా ఈ గొడవ సద్దుమణిగింది. అప్పటినుంచి మంచు ఫ్యామిలీపై మెగా ఫ్యామిలీ రివేంజ్ కోసం చూస్తోందనే పుకారు నడుస్తోంది.

ఇటీవల ఏపీ సీఎం జగన్ ని కలిసేందుకు వెళ్లిన టాలీవుడ్ బృందంలో మంచు ఫ్యామిలీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. కనీసం మా అధ్యక్షుడు అనే హోదాలో కూడా విష్ణుకి ఆహ్వానం అందలేదు. దీంతో చిరంజీవి బృందం వెళ్లొచ్చాక సెపరేట్ గా మంచు విష్ణు, సీఎం జగన్ తో కలసి లంచ్ చేసి.. సరదాగా మీడియాతో మాట్లాడారు. మా ఫ్యామిలీకీ ఆహ్వానం అందకుండా చేశారంటూ ఓ బాంబు పేల్చారు.

ఆ తర్వాత మోహన్ బాబు లీడ్ క్యారెక్టర్ చేసిన సన్నాఫ్ ఇండియా విడుదల, ట్రోలింగ్, థియేటర్లకు జనాలు రాకపోవడం.. ఇలా అన్నిటికీ కొంతమంది కారణం అంటూ మోహన్ బాబే నేరుగా విమర్శలు సంధించారు. పరువునష్టం కేసు అంటూ మరో అడుగు ముందుకేశారు. ఇలా ఈ కార్చిచ్చు రగులుతూనే ఉంది. తాజాగా నాగశ్రీను వ్యవహారంతో ఇది మరో మలుపు తిరిగింది.

నాగశ్రీను అనే హెయిర్ స్టైలిస్ట్ తమ ఇంటి నుంచి మేకప్ సామగ్రి దొంగతనం చేశాడనేది మంచు ఫ్యామిలీ ఆరోపణ. కాదు కాదు, మోహన్ బాబు బండబూతులు తిట్టారు, అందుకే మానేశాను, దొంగతనం నేరం మోపడం దుర్మార్గం అంటూ నాగశ్రీను మీడియా ముందుకొచ్చారు. వారిద్దరి ఎపిసోడ్ లో ఇప్పుడు నాగబాబు సడన్ ఎంట్రీ ఆశ్చర్యకరంగా ఉంది.

నాగబాబు 50వేల రూపాయల భారీ సాయం ఇవ్వడంతో పాటు నాగశ్రీను తల్లి చికిత్స వ్యవహారాలను కూడా తామే చూసుకుంటామన్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. సంస్థ నుంచి జీతం కూడా ఆగిపోయిందంటూ నాగశ్రీనుపై నాగబాబు జాలి చూపించడం కొత్త వివాదానికి దారి తీసింది. మంచు ఫ్యామిలీ జీతం కూడా ఇవ్వకుండా తరిమేసిందనే ఇన్ డైరెక్ట్ మీనింగ్ అక్కడ వచ్చింది.

దీంతో మంచు ఫ్యామిలీ మరోసారి హర్ట్ అయింది. తమ పీఆర్వోతో వివరణ ఇప్పించింది. నాగబాబు మంచి పని చేశారు కానీ, అక్కడ కూడా మంచు ఫ్యామిలీని టార్గెట్ చేయాలనుకోవడమే ఆయనలోని జబర్దస్త్ లక్షణాన్ని మరోసారి ఎలివేట్ చేసింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.