మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మితభాషి. ఎంతో అవసరం ఉంటే తప్ప నోరు తెరిచి మాట్లాడరు. ఇక రాజకీయ విమర్శలంటారా …తనకు తానుగా ఏ ఒక్కర్నీ టార్గెట్ చేసి మాట్లాడరు.
తనపై ప్రత్యర్థుల విమర్శలకు జవాబు చెప్పడం తప్ప, చాలా మందిలా ప్రచారం కోసం మంత్రి పెద్దిరెడ్డి అనవసరంగా నోరు పారేసుకోరు. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీని సీపీఐ నారాయణ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
పేదలకు ఇస్తున్న స్థలం కుక్కల దొడ్డి అంత లేదనడం నారాయణ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. ఇళ్ల లబ్ధిదారుల వద్దకెళ్లి నారాయణ ఆ మాటలు అనాలని మంత్రి సవాల్ విసిరారు.
నారాయణ తనకు మంచి మిత్రుడని, కానీ ఆయన చంద్రబాబునాయుడికి లొంగిపోయాడని విమర్శించారు. అందువల్లే నారాయణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. సీపీఐని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎప్పుడో అమ్మేశారని మంత్రి పెద్దిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
లోకేశ్ మాటలకు తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీకి బేస్మెంట్ కదిలిపోయిందని, ఆ పార్టీని కాపాడుకునే పనిలో చంద్రబాబు ఉన్నారని మంత్రి ఎద్దేవా చేశారు.