తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులెవరో సమాజం ముందు నిలబెట్టడం, వారికి శిక్ష వేయించే క్రమంలో డాక్టర్ నర్రెడ్డి సునీత చేస్తున్న న్యాయపోరాటం అభినందనీయం. పట్టువదలకుండా, భయపడకుండా, అన్నింటికి మించి డబ్బుకు వెనుకాడకుండా ఆమె ముందుకే వెళుతున్నారు. ఈ క్రమంలో ఆమె దూకుడు విపరీత ధోరణులకు దారి తీస్తున్నాయన్న విమర్శ లేకపోలేదు. తాజాగా దస్తగిరి క్షమాభిక్ష రద్దు పిటిషన్ను పరిగణించొద్దని సుప్రీంలో డాక్టర్ సునీత పిటిషన్ వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
వివేకాను అత్యంత అమానుషంగా గొడ్డలితో నరికి చంపానని దస్తగిరి హీరోయిజంతో మీడియా ముందు చెప్పాడు. అతను అప్రూవర్గా మారాడనే ఏకైక కారణంతో అలా సమాజంపై వదిలేయాలని డాక్టర్ సునీత ఎలా అనుకుంటున్నారనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దస్తగిరిని వదిలేస్తే, రేపు మరొకరికి ఇలాగే జరగదనే గ్యారెంటీ ఏముంటుంది?
తన బాస్, గురువు అయిన వివేకాను అమానవీయంగా చంపిన దస్తగిరి క్షమాభిక్షను రద్దు చేయాలని మృతుడి పీఏ ఎంవీ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం గమనార్హం. బాధితుడి ముసుగులో కృష్ణారెడ్డి పిటిషన్ వేశారని ఆమె పేర్కొన్నారు. వివేకా హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినంత మాత్రాన కృష్ణారెడ్డిని బాధితుడిగా గుర్తించడానికి వీల్దేదని సునీత తెలిపారు. తాను, తన తల్లి మాత్రమే బాధితులమని సుప్రీంకోర్టుకు సునీత విన్నవించారు.
సునీత, ఆమె తల్లి బాధితులనే వాదనలో రెండో అభిప్రాయానికి చోటు లేదు. అలాగని నిందితుల విషయంలో బాధితుల అభిప్రాయం ప్రకారం జరగాలని కోరుకోవడమే విమర్శలకు దారి తీస్తోంది. తాము చెబుతున్నాం కాబట్టి ఫలానా నిందితుడిని విడిచి పెట్టాలని, మరొకరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని సునీత కోరుకోవడం ఏంటనే చర్చకు తెరలేచింది. దీంతో నేరాన్ని బట్టి కాకుండా, సంబంధిత నిందితులతో బాధితులైన తమకున్న రిలేషన్స్ రీత్యా కేసు ముందుకు నడవాలని సునీత కోరుకుంటున్నట్టుగా వుందనే అభిప్రాయం బలపడుతోంది.
ఈ ధోరణి ఎంత వరకు సరైందో డాక్టర్ సునీత ఆలోచించుకోవాలి. ఎందుకంటే, ఇంత కాలం తండ్రి కేసులో దోషులను తేల్చేందుకు సునీత పోరాడుతోందని అభినందించిన వాళ్లే, దస్తగిరిని వెనకేసుకు రావడంతో శంకించాల్సి వస్తోంది. దస్తగిరి అప్రూవర్గా మారడం వల్లే ఈ కేసు పురోగతి సాధించిందని సునీత సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నట్టున్నారు.
సీబీఐ ఆదేశాల మేరకు కూడా సునీత పట్టువిడుపులతో నడుచుకుంటున్నారని అనేందుకు ఇదో ఉదాహరణగా నిలుస్తోంది. నేరం కేంద్రంగా విచారణ జరిగితే బాగుండేది. కానీ వ్యక్తుల కేంద్రంగా వ్యవహారం నడుస్తోందనే భావన విస్తృతంగా వ్యాపిస్తోంది.