మెగాస్టార్ చిరంజీవి మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరుతో పాటు పలువురు ట్విటర్ వేదికగా ఆత్మీయ శుభాకాంక్షలు చెప్పారు. వీటిలో చిరు ట్వీట్ ఎంతో ఆత్మీయంగా, హార్ట్ టచింగ్గా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిరుతో పాటు ప్రిన్స్ మహేశ్బాబు, హీరో రవితేజ, మంచు విష్ణు, సుధీర్వర్మ, నిర్మాత బండ్ల గణేష్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, దర్శకుడు మలినేని గోపిచంద్ తదితరులు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు.
ముందుగా చిరు ట్వీట్ చూద్దాం.
‘డైనమిక్ యంగ్ లీడర్ వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. లక్ష్యాలను ఛేదించడంలో మీ సంకల్పం, మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం. ఎంతో సంతోషంగా, అద్భుతంగా ఇంకో ఏడాది గడపాలి. మరెన్నో సంవత్సరాలు ప్రజలకు మీరు సేవలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని మెగాస్టార్ తన శుభాకాంక్షల సందేశంలో ఆకాంక్షించారు.
సూపర్స్టార్ మహేశ్బాబు తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన ఏమన్నారంటే…. ‘గౌరవనీయులైన సీఎం వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ విజన్, కృషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి’ అని చక్కటి ట్వీట్ చేశారు.
ముఖ్యంగా వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత చిరుతో సాన్నిహిత్యం పెరిగిన సంగతి తెలిసిందే. చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత పూర్తిగా సినిమాల్లో బిజీ అయ్యారు. జగన్ కోరిక మేరకు చిరు దంపతులు ఒకసారి తాడేపల్లి వెళ్లి , సీఎం ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. ఆ తర్వాత జగన్ ఆదరాభిమానాల గురించి చిరు ఎంతో గొప్పగా చెప్పడం చూశారు.
అలాగే మహేశ్బాబు కుటుంబంతో కూడా జగన్కు మంచి సంబంధాలున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డితో మహేశ్ తండ్రి సూపర్స్టార్ కృష్ణకు సన్నిహిత సంబంధాలుండేవి. వైఎస్సార్ మరణానంతరం కూడా కృష్ణ, జగన్ కుటుంబాల మధ్య అదే మైత్రి కొనసాగుతోంది. తాజాగా మహేశ్ బర్త్డే విషెస్తో అది మరోసారి రుజువైంది.