సొంత పార్టీని పెట్టుకుని గంగావతి నుంచి పోటీకి దిగిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి విజయం దిశగా సాగుతున్నాడు. మొదటి రౌండ్లలో కాస్త వెనుకబడిన గాలి జనార్ధన్ రెడ్డి ఆ తర్వాత మాత్రం పుంజుకున్నాడు. నాలుగైదు రౌండ్ల ఫలితాలు వచ్చే సరికి జనార్దన్ రెడ్డి మెజారిటీ సుమారు పది వేల వరకూ చేరినట్టుగా ఉంది. దీంతో ఆయన విజయం దిశగా సాగుతున్నారనుకోవాల్సి వస్తోంది.
అయితే ఆయన భార్య గాలి లక్ష్మి అరుణ మాత్రం బళ్లారి సిటీలో వెనుకబడ్డారు. సొంత పార్టీ తరఫు నుంచి గాలి లక్ష్మీ అరుణ బళ్లారి సిటీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగగా, జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి బీజేపీ తరఫు నుంచి బరిలోకి దిగారిక్కడ. అయితే వీరిద్దరి మీదా కాంగ్రెస్ అభ్యర్థి భరత్ పై చేయి సాధిస్తుండటం విశేషం. బళ్లారి సిటీ నుంచి ఇలా గాలి కుటుంబీకులు ఇద్దరు వెనుకబడగా కాంగ్రెస్ అభ్యర్థి భరత్ రెడ్డి ముందంజలో ఉన్నాడు.
ఇక బీజేపీ తరఫునే బరిలోకి దిగిన గాలి కరుణాకర్ రెడ్డి కూడా వెనుకంజలో ఉన్నాడు. ఇక ఒకప్పటి గాలి అనుచరుడు బీజేపీ ముఖ్య నేత, మాజీ మంత్రి శ్రీరాములు కూడా వెనుకబడటం విశేషం. ఈ సారి బళ్లారి రూరల్ నుంచి పోటీ చేసిన శ్రీరాములు చాలా ఓట్ల తేడాతో వెనుకబడ్డాడు. దాదాపు ఓటమి దిశగా పయనిస్తున్నాడు.
మరోవైపు రామనగర నుంచి పోటీ చేసిన నిఖిల్ కుమార గౌడ వెనుకబడటం విశేషం. కుమారస్వామి భార్య రామనగర నుంచి టికెట్ ను త్యాగం చేసి నిఖిల్ కుమారగౌడ కు అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఏకంగా పదివేల ఓట్ల మెజారిటీని ఇప్పటికే సాధించాడు. దీంతో నిఖిల్ కు ఓటమి తప్పేలా లేదు.
ఇక ముఖ్య నేతల్లో డీకే శివకుమార భారీ మెజారిటీ దిశగా సాగుతున్నారు. కుమారస్వామి, సిద్ధరామయ్య, బసవరాజ్ బొమ్మై .. వీళ్లంతా ముందంజలో ఉన్నారు.