కర్ణాటకలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 224. కనీసం 113 సీట్లు సాధించిన పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మొదటి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.
కన్నడ వార్తా చానళ్లు కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ స్థాయి సీట్లలో లీడ్ లో ఉందనే విషయాన్ని చెబుతున్నాయి. రెండో రౌండ్ మూడో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ సుమారు 113 సీట్లలో లీడ్ లో ఉన్నట్టుగా వార్తా చానళ్లు చెబుతున్నాయి.
జాతీయ వార్తా చానళ్లు కొన్ని కాంగ్రెస్ పార్టీ 120 సీట్లలో లీడ్ లో ఉన్నట్టుగా కూడా చెబుతున్నాయి. అయితే లీడ్స్ అన్నీ వందలు, రెండు మూడు వేలలోనే కాబట్టి.. కౌంటింగ్ పూర్తయ్యే వరకూ కూడా ఎవరికీ విజయంపై భరోసా లేనట్టే అనుకోవాలి. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతూ ఉంది.
భారతీయ జనతా పార్టీ సుమారు 80 సీట్లలో లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. జేడీఎస్ 26 సీట్లలో విజయం దిశగా సాగుతోంది. భారతీయ జనతా పార్టీకి ఇవి ఒక రకంగా షాకింగ్ రిజల్ట్సే. మోడీ మ్యాజిక్ ను నమ్ముకుని భారతీయ జనతా పార్టీ విజయం పై చాలా ఆశలతోనే కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో ఈ ఫలితాలు బీజేపీకి షాకింగ్ లాగా ఉన్నాయి. బీజేపీ తరఫున ఎనిమిది మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
ఇక కింగ్ మేకర్ అనుకున్నజేడీఎస్ కు కూడా అంత సానుకూల ఫలితాలు కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగా జేడీఎస్ పాతిక సీట్ల వరకూ సాధించుకునేలా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మినిమం మెజారిటీ దిశగాసాగుతూ ఉండటంతో జేడీఎస్ అవసరం కచ్చితంగా ఏర్పడేలా లేదు.
అయితే బీజేపీ ప్లాన్ బీతో ఉందని.. కాంగ్రెస్ కు మినిమం మెజారిటీకి ఒకటీ రెండు సీట్లు తక్కువైతే జేడీఎస్ తో కలిసి తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వ్యూహంతో బీజేపీ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. దానికి జేడీఎస్ కూడా సై అనవచ్చు. మరి మెజారిటీ మార్కును కాంగ్రెస్ దాటితే మాత్రం.. ఈ ఆటలకు అవకాశాలు తక్కువే!