నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతూ వచ్చే ఎన్నికల్లో మరో మారు టీడీపీదే అధికారమని తనకు మంత్రి పదవి ఖాయమని చింతకాయల అయ్యన్నపాత్రుడు ధీమా పడుతున్నారు. కొన్నాళ్ళు ఆగండి తమ్ముళ్ళూ మంచి రోజులు మనకు వస్తున్నాయని చెప్పుకుంటూ టీడీపీ పెద్దాయన. నెలలు నెట్టుకుని వస్తున్నారు
నర్శీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా గణేష్ శంకర్ 2019 ఎన్నికల్లో గెలిచారు. మరోసారి గెలవడానికి ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. 2024 ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటే సైకిల్ ని జోరెత్తించవచ్చు అని అయ్యన్న లాంటి సీనియర్లు భావిస్తున్నారు.
అదే అయ్యన్న ఇలాకాలో జనసేన ఇటీవల కాలంలో హుషార్ చేస్తోంది. ఆ పార్టీకి చెందిన నియోజకవర్గం నేతలు అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం ఖాయమని ముందే జోస్యం చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే ఏపీ ప్రజల కష్టాలు తీరుతాయని కూడా అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో నర్శీపట్నంలో జనసేనను గెలిపించాలని ఇల్లిల్లూ తిరిగి జనాలకు చెబుతున్నారు. నర్శీపట్నం ప్రజల నుంచి జనసేనకు విశేష స్పందన వస్తోందని, తమ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పవన్ సీఎం కావడం అన్నది నర్శీపట్నం ప్రజలతో వారు తీసుకొచ్చే మార్పుతోనే సాధ్యపడుతుందని అంటున్నారు.
అంటే వచ్చే ఎన్నికల్లో అయ్యన్నకు కాకుండా టీడీపీని కాకుండా జనసేనను ప్రజలు గెలిపిస్తారు అన్నదే సైనికులు చెబుతున్న పరమ సత్యం. సీనియర్ నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడు అనుచరులకు జనసేన నేతల మాటలు ఎలా ఉన్నాయో కానీ నర్శీపట్నం మాది ఏపీకి పవన్ సీఎం అంటూ సాగుతున్న జన సైనికులు రాజకీయ హోరునే సృష్టిస్తున్నారు.
నర్శీపట్నంలో ప్రకంపనలే పుట్టేలా చేస్తున్నారు. రేపటి రోజున్న పొత్తు కాస్తా ఉండకపోతే జనసేనని తమ్ముళ్ళు లైట్ తీసుకుంటారా అన్నదే రాజకీయ వర్గాలలో ప్రశ్నగా వస్తోంది.